Tejaswisurya created a big problem for the Telangana BJP: లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ను విమర్శించే క్రమంలో ఆయన వాడిన పదజాలం, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను బ్రిటీష్ పాలకులు చేసిన దేశ విభజనతో పోల్చడం.. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ను తాకింది. ఈ పరిణామం అటు కేంద్ర బీజేపీకి, ఇటు రాష్ట్ర బీజేపీ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది.
తెలంగాణ సెంటిమెంట్పై గురితప్పిన బాణం
రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రత్యర్థిని దెబ్బకొట్టే క్రమంలో చేసే వ్యాఖ్యలు సెల్ఫ్ గోల్ గా మారుతుంటాయి. తేజస్వీ సూర్య విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ విభజనను అశాస్త్రీయంగా చేసిందని విమర్శించడం వరకు రాజకీయం అనిపించినా, దానిని బ్రిటీష్ వారు దేశాన్ని ముక్కలు చేసిన తీరుతో పోల్చడం తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటాన్ని కించపరచడమేనని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అనేది ఒక చారిత్రక అవసరం , ప్రజా ఆకాంక్ష. దీనిని ప్రతికూల కోణంలో చూడటం ద్వారా బీజేపీ తన పునాదులను తానే దెబ్బతీసుకుంటుందన్న వాదన వినిపిస్తోంది.
ఏకమైన విపక్షాలు - బీజేపీపై ఉమ్మడి దాడి
ఈ వివాదాన్ని అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వదులుకోవడానికి సిద్ధంగా లేవు. సాధారణంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ఈ రెండు పార్టీలు, ఇప్పుడు బీజేపీని కార్నర్ చేయడంలో పోటీ పడుతున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తారా అంటూ కేటీఆర్, హరీష్ రావు వంటి బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతుంటే, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో నిరసనలకు పిలుపునిస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీగా బీజేపీని ముద్ర వేయడానికి ఈ వ్యాఖ్యలు ఒక బలమైన ఆయుధంగా మారాయి.
బీజేపీ నేతల డిఫెన్సివ్ స్టేట్మెంట్స్
తేజస్వీ సూర్య వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీ నేతలు అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన మాటలను బహిరంగంగా ఖండించలేక, అలాగని సమర్థించలేక సతమతమవుతున్నారు. ఆయన విభజన తీరునే ప్రశ్నించారు తప్ప, తెలంగాణ ఏర్పాటును కాదు అని కొందరు నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అది ప్రజల్లోకి వెళ్లడం లేదు. గతంలో పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ చేసిన తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు అనే వ్యాఖ్యలను ఈ సందర్భంగా విపక్షాలు గుర్తు చేస్తూ, బీజేపీకి మొదటి నుంచి తెలంగాణ అంటే గిట్టదనే వాదనను బలంగా వినిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన ఎంపీ అయి ఉండి, పొరుగున ఉన్న తెలంగాణ మనోభావాలను దెబ్బతీయడంపై మేధావి వర్గం కూడా పెదవి విరుస్తోంది.
సవరించుకుని..కవర్ చేసుకుంటారా?
తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఇటువంటి అనాలోచిత వ్యాఖ్యలు పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయి. సెంటిమెంట్ ప్రధానంగా సాగే తెలంగాణ రాజకీయాల్లో ఏ చిన్న పొరపాటు చేసినా దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై జాతీయ నాయకత్వం వెంటనే స్పందించి వివరణ ఇవ్వకపోతే, అది రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీకి పెద్ద మైనస్గా మారే అవకాశం ఉంది. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో ప్రజల మనోభావాలను తాకడం అనేది కత్తి మీద సాము వంటిదని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.
