Revanth Reddy is doing soft Hindutva politics:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో బాసర, భద్రాద్రి, వేములవాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, ఆధ్యాత్మిక కేంద్రాల పునరుద్ధరణకు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ ఆయన చేస్తున్న పర్యటనలు కేవలం భక్తి కోణంలోనే కాకుండా, ఒక పక్కా రాజకీయ వ్యూహంతో కూడినవిగా  భావిస్తున్నారు.  

Continues below advertisement

సాఫ్ట్ హిందూత్వ - కాంగ్రెస్ కొత్త అస్త్రం

తెలంగాణలో బీజేపీ తన హిందూత్వ నినాదంతో బలపడుతున్న తరుణంలో, ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి  సాఫ్ట్ హిందూత్వ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీపై ఉన్న మైనారిటీ అనుకూల పార్టీ  అనే ముద్రను చెరిపివేయకుండా మెజారిటీ హిందూ ఓటర్లకు చేరువయ్యేందుకు ఆయన ఈ ఆలయాల అభివృద్ధిని ఒక వేదికగా చేసుకుంటున్నారు. బీజేపీ చేసే మతపరమైన విమర్శలకు అవకాశం ఇవ్వకుండా, తాము కూడా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని గౌరవిస్తామని  చేతల్లో చూపిస్తున్నారు.

Continues below advertisement

బీజేపీకి గట్టి కౌంటర్ 

తెలంగాణలో హిందూ ఓట్లే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీకి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అడ్డుకట్ట వేస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణలోని స్థానిక సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న బాసర , భద్రాద్రి , వేములవాడ  వంటి క్షేత్రాలకు పెద్దపీట వేస్తున్నారు. బాసర ఆలయ అభివృద్ధికి రూ. ₹225 కోట్లు కేటాయించడం, తిరుమల తరహాలో అక్కడ రాజకీయ కార్యకలాపాలను నిషేధించాలని ఆదేశించడం ద్వారా ఆయన ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపారు. కేవలం ఆలయాల అభివృద్ధి మాత్రమే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాలను బాగు చేయడం ద్వారా ప్రజల మనసు గెలుచుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. యాదగిరిగుట్టను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసినప్పటికీ, భద్రాద్రి వంటి ఇతర కీలక ఆలయాలను వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. ఆ లోటును భర్తీ చేస్తూ, భద్రాద్రి మాస్టర్ ప్లాన్‌ను స్వయంగా సమీక్షించడం ద్వారా రేవంత్ రెడ్డి తనను తాను ఒక  ప్రజా పక్షపాత ఆధ్యాత్మిక వాది గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.

హిందూత్వ వర్సెస్ సంక్షేమం - సమతుల్యత

రేవంత్ రెడ్డి వ్యూహం కేవలం హిందూత్వకే పరిమితం కాలేదు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నాయకులు చేసే  యాంటీ-హిందూ  విమర్శలకు బాసర, వేములవాడ అభివృద్ధి పనులే సమాధానంగా ఆయన భావిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు, మధ్యతరగతి హిందూ ఓటర్లను కూడా దగ్గర చేసే అవకాశం ఉంది.

ఎన్నికల లక్ష్యం వైపు అడుగులు

రేవంత్ రెడ్డి ఆలయాల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు తెలంగాణలో త్రిముఖ పోటీని ఆసక్తికరంగా మార్చాయి. బీజేపీ హిందూత్వ నినాదానికి, కాంగ్రెస్  సాఫ్ట్ హిందూత్వ, అభివృద్ధి నినాదానికి మధ్య ఈ పోటీ సాగుతోంది. ఈ వ్యూహం గనుక ఫలిస్తే, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పెరగకుండా అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి విజయవంతమైనట్లే. అయితే, ఈ ఆధ్యాత్మిక పనులు కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా, గడువులోగా పూర్తయితేనే ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకం మరింత బలపడుతుంది.