Telangana Congress :   పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలే చేరిన ఘటనలో అడ్వాంటేజ్ సాధించేందుకు బీఆర్ఎస్‌కు ఓ అవకాశం దక్కింది.   గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఒక్క సారిగా ప్లేట్ ఫిరాయించి మళ్లీ  బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ఆయన చెబుతున్నారు. కావాలంటే త్వరలోనే తాను కేసీఆర్‌ను కలుస్తానని అంటున్నారు. నిజానికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనపై అనర్హతా పిటిషన్ కూడా బీఆర్ఎస్ దాఖలు చేసింది. అయినా  హఠాత్తుగా ఎందుకు గద్వాల ఎమ్మెల్యే రివర్స్ అయ్యారో చాలా మందికి అర్థం కావడం లేదు. 


ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అసలేం జరిగిందా అని ఆరా తీస్తున్నారు. కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన గద్వాల కాంగ్రెస్ నేతలు  అందర్నీ నచ్చ చెప్పించి మరీ పార్టీలో చేర్చుకున్న మోహన్ రెడ్డి ఎందుకు మళ్లీ రివర్స్ అయ్యారన్న దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తన  ఎన్నిక చెల్లదని హైకోర్టులో పడిన  పిటిషన్లపై విచారణలో లాయర్ ను గతంలో బీఆర్ఆర్ ఏర్పాటు చేసింది. పార్టీ మారడంతో లాయర్ ను తీసేశారు. ఇప్పుుడు లాయర్ ను కొనసాగించాలని కేటీఆర్ ను కోరానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు. అంత మాత్రానే ఆయన రివర్స్ అయ్యే అవకాశం లేదని.. ఆయన ఏదో తీర్చలేని కోరిక కేరి ఉంటారని పట్టించుకోకపోవడంతో  బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కొంత మంది బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.                                                     


మరో వైపు కృష్ణమోహన్ రెడ్డి వెనక్కి వచ్చిన సందర్భాన్ని బేస్ చేసుకుని ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ సిద్దమయింది. కొంత మంది ఇతర ఎమ్మెల్యేలపైనా  బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యూహాత్మక రివర్స్ ఫిరాయింపు ప్రచారం ప్రారంభించింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి టీ తాగుతున్న ఓ ఫోటో తీసి బయటకు వచ్చింది.  దాంతో ఆయన కూడా రివర్స్ జంపింగ్ అనే ప్రచారం ఊపందుకుంది. ఈ జాబితాలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను కూడా చేర్చారు.  దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్నారు. తాము కాంగ్రెస్ పార్టీని వదలడం లేదని.. ఆ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. 


తమపై తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. ఏదో ఫ్రెండ్లీగా టీ తాగేందుకు  పిలిస్తే వెళ్లానని.. అంత మాత్రాన తాను కాంగ్రెస్ పార్టీని వీడిపోతున్నట్లు గా ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఓ పార్టీలో ఉన్న నేతపై అదే పార్టీలో ఉన్న పెద్దలకు అనుమానం కలిగేలా చేయడం కూడా రాజకీయ వ్యూహంలో భాగంగా అందులో భాగంగానే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ మైండ్ గేమ్ ప్రారంభించిందని అంటున్నారు. కాంగ్రెస్‌లో ఉక్కపోతను వారు భరించలేరని అంటున్నారు.