AP Politics : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు (Apcc Chief ) వైఎస్ షర్మిలా రెడ్డి (Ys Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమి హక్కుల చట్టం (Land Title Act) పేరుతో సర్కార్ భూ కబ్జాల (Land Grabbing) కు పాల్పడే చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములకు రక్షణ ఉండదని హెచ్చరించారు.  ఇప్పటికే మద్యాన్ని సర్కార్ బిజినెస్ మార్చేశారన్న ఆమె...కొత్త చట్టంతో సర్కార్ భూ కబ్జాలు కూడా చేయబోతుందన్నారు. లిక్కర్ పేరుతో చెప్పిన మద్యాన్ని మాత్రమే అమ్మాలని రూల్ తెచ్చారన్న వైఎస్ షర్మిలా రెడ్డి...రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మొత్తం దోచేశారని విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తో 25 శాతం అదనంగా మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. లిక్కర్ వ్యాపారం గుప్పిట్లో పెట్టుకున్నట్లు... ప్రజల భూములను గుప్పిట్లో పెట్టుకోవడానికి కుట్రలు చేస్తోందన్నారు. ఒక మనిషిని పెడతారని...ఆయన చెప్పినట్లే భూ లావాదేవీలు ఉండాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇదేం చట్టమని ప్రశ్నించిన వైఎస్ షర్మిలా రెడ్డి...భూములపై సొంత హక్కులు హరించే చట్టం తేవడం ఎంటన్నారు. ఇలాంటి చట్టాలు తెచ్చే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలా ?  వద్దా అన్నది ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.


దెందులూరు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన  బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.  జగన్ ఆన్నను అభిమానులు బాగా పొగుడుతున్నారని.. సిఎం గా ఉండి జగన్ ఆన్న ఏం సాధించారని షర్మిల ప్రశ్నించారు.  పులి,సింహం అని పొగుడుతున్నారు ఎవరికి పులి ..ఎవరికి సింహం చెప్పాలన్నారు.  సాక్షి పేపర్ కి పులినా ?..ఆయన సోషల్ మీడియాకి సింహమా ? అని ఎద్దేవా చేశారు.  ఒకసారి బీజేపీ మీద విప్పండి మీ పంజా...ఒకసారి బీజేపీపై దమ్ముంటే గాండ్రించండని సవాల్ చేశారు. 


జగన్ అన్న  బీజేపీ మీద పంజా విప్పితే తెలుస్తుంది ! 


పులులు,సింహాలు కాదు..ఆంధ్ర రాష్ట్ర ద్రోహులని మండిపడ్డారు.  ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు..ఆడబిడ్డ మీద బూతులు మాట్లాడుతున్నారు. .  సొంత ఆడబిడ్డలకు బజారుకు ఈడ్చుతున్నారు.. వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్నారు.  వైసిపికి ఇదే సాధ్యమయ్యిందని విరుచుకుపడ్డారు.  రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవడం చేతకాదని..  అసెంబ్లీ వేదికగా బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారని మండిపడ్డారు.  విభజన సమస్యలు అన్ని సాధించుకున్నారనీ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు..  బీజేపీతో జగన్,బాబు నడిపేది ట్రయాంగిల్ లవ్ స్టొరీ అని విమర్శించారు. పోటీ పడి మరి బీజేపీతో పొత్తులకు పోతున్నారు..చంద్రబాబు సైతం బీజేపీ మీద ఒక్క మాట అనటం లేదన్నారు.  వాళ్ళు పిలవడం ఏమిటో..ఈయన పోవడం ఏమిటో . వెళ్తే వెళ్ళాడు ..హోదా ఇస్తేనే పొత్తు అని కండీషన్ ఎందుకు పెట్టలేదని షర్మిల ప్రశ్నించారు. ఎందుకంటే చంద్రబాబుకి చిత్తశుద్ది లేదన్నారు. 


చంద్రబాబు బీజేపీ కార్యకర్త


చంద్రబాబు బాబు ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత కాదు..బీజేపీ కార్యకర్త అని షర్మిల విమర్శించారు. ఒక్కరికీ రాష్ట్ర ప్రయోజనాల మీద చిత్తశుద్ది లేదన్నారు.  10 ఏళ్లుగా రాష్ట్ర హక్కుల సాధన లో TDP, YCP ఘోరంగా విఫలమయ్యాయన్నారు.  15 ఏళ్లు హోదా కావాలని చెప్పిన చంద్రబాబు... 25 మంది ఎంపీలు ఇస్తే హోదా ఎందుకు రాదో చూస్తామని చెప్పిన జగన్ ఆన్న... అధికారంలో ఉండి ఒక్కటంటే ఒక్క ఉద్యమం చేయలేదన్నారు.  ఇద్దరు బీజేపీ కి తొత్తులుగా మారారు ఇద్దరినీ చెరోవైపు పెట్టుకొని బీజేపీ ఆట ఆడుతుందని విమర్శించారు.  25 మంది ఎంపీలు పెట్టుకొని బీజేపీ కి గుల్లాంగిరి చేస్తున్నాయి ఇక్కడ పార్టీలు అని విమర్శించారు.  ఎందుకు గులాం గిరి చేయాల్సిన పరిస్థితి ? చంద్రబాబు బీజేపీ మెప్పుకోసం ఎన్నో తిప్పలు పడుతున్నాడని విమర్శించారు.  జగన్ ఆన్న ఢిల్లీకి పోతాడట .. ఈయన కూడా అదే పరిస్థితి.. ఎందుకీ వంగి వంగి దండాలు పెడుతున్నారని ప్రశ్నించారు. 


 సచివాలయాన్ని  ముట్టడిస్తా ! 


 హోదా ఇవ్వలేదు...పోలవరం  ఇవ్వలేదు... రాజధాని ఇవ్వలేదు.. రైల్వే జోన్ లేదు...విశాఖ స్టీల్ కి అమ్మేయాలని చూస్తున్నారు .. అయినా రెండు పార్టీలకు సిగ్గు అభిమానం అంటూ లేదన్నారు.  కొట్లాడటానికి ఏమి లేవు అంటున్నారు .. బడ్జెట్ పుస్తకాల్లో బీజేపీ పొగుడుతున్నారు  రావాల్సిన అన్ని వచ్చాయా  అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది.. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ చేశారన్నారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని.. ఇక నుంచి రోజూ ధర్నాలు..మంత్రుల ,ఎమ్మెల్యేల ఇళ్ల  ముట్టడి చేస్తామని హెచ్చించారు. తాను కూడా సచివాలయం ముట్టడి చేస్తానని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఆంధ్రాలో అడుగు పెట్టానన్నారు.  రాష్ట్ర హక్కులు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని షర్మిల ప్రకటించారు.