నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గానికి ACDP ద్వారా వచ్చే 2.24 కోట్ల నిధులను విడుదల చేయలేదని రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజవర్గానికి నిధులు విడుదల చేయకపోతే ఖానాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ హెచ్చరించారు. వచ్చే నిధులను ఆపి తనను అణగ తొక్కడనికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ పై తీవ్రస్థాయిలో ఆమె మండిపడ్డారు.


 పోలీస్ అధికారులు నా దగ్గర ఉన్న ఎస్.బి. కానిస్టేబుళ్లను కూడా తీయడం సరికాదని మండిపడ్డారు. ఖానాపూర్ లో మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మన్, పార్టీ అధ్యక్షుడు కావడానికి నేను ఎంతో కృషి చేశానని తెలిపారు. వాళ్ళకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. నియోజికవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను రెబల్ గా నైనా, ఇండిపెండెంట్ గా నైనా తప్పక పోటీలో ఉంటానని అన్నారు. అభివృద్ధి నేను చేస్తే గొప్పలు వారు చెప్పుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కక్షపూరితంగా అభివృద్ధి పనులను ఆపివేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెప్తారని అన్నారు. తాజాగా ఏసీడీపీ నిధులు ఆపారన్నారు.  అభివృద్ధి ఆపడం సరికాదని, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, రోడ్ల పనులు ఆపారన్నారు. నిధులు రాకుండా నిలిపి వేశారని ఆవేదన వ్యక్తం చేసారు.  తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని పార్టీ మారింది తన భర్త అని, తాను ఇంకా  బీఆర్ఎస్ లోనే ఉన్నానని వెల్లడించారు. తాను  ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని రేఖానాయక్ తెలిపారు. ప్రజలకు అభివృద్ధి కావాలని, నిధులు అడిగితే తాను కాంగ్రెస్ పార్టీ అనడం సరికాదన్నారు.  తాను పార్టీ మారనేలేదు అని రేఖా నాయక్ తెలిపారు.


పార్టీ మారింది నా భర్త.. నేను కాదు అని ఆమె అన్నారు. కావాలనే తన అల్లుడు ఐపీఎస్ బదిలీపై స్పందిస్తూ ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు చేసిన అన్యాయం చాలదన్నట్లు నా బిడ్డకు అన్యాయం చేశారంటూ ఇటీవలే కార్యకర్తల దగ్గర బోరున రేఖా నాయక్ విలపించారు.  తన భర్త కాంగ్రెస్ లోకి వెళ్లారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారి తండ్రి సీపీఐ పార్టీలో పనిచేయడం లేదా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పని చేశానని, నియోజకవర్గం కోసం కూడా పని చేశానని చెప్పారు.  9 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని... అభ్యర్థి కోసం అభివృద్ధిని ఆపడం ఏమిటని ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని ఇలాంటి ధోరణి ఏదైనా ఉంటే ప్రభుత్వం వెంటనే దాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి నియోజకవర్గానికి నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే రేఖ నాయక్ డిమాండ్ చేశారు.