Do or die situation for Congress in Kerala assembly elections: కేరళ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక అసాధారణ గండం ఎదుర్కొంటోంది. దశాబ్దాలుగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారం మార్పిడి జరిగే సంప్రదాయానికి గత ఎన్నికల్లో తెరపడింది. ఎల్‌డీఎఫ్ వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకోవడంతో, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్  ఉనికికే ప్రమాదం ఏర్పడింది. రాబోయే ఎన్నికలు కేరళ కాంగ్రెస్‌కు కేవలం అధికారం కోసం మాత్రమే కాదు, ఆ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న జీవన్మరణ  పోరాటం.

సంప్రదాయం బద్దలు.. కాంగ్రెస్ వైఫల్యం 

కేరళలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. సాధారణంగా అధికారం మారుతుందన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్, క్షేత్రస్థాయిలో లెఫ్ట్ కూటమి వ్యూహాలను అంచనా వేయడంలో విఫలమైంది. పినరయి విజయన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా విపత్తుల సమయంలో వారు చూపిన చొరవ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విభేదాలు, బలమైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీని ప్రతిపక్షానికే పరిమితం చేశాయి.

 గాంధీ వారసుల ఇమేజ్‌కు పరీక్ష 

రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి  రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు  ప్రియాంకా గాంధీ ఎంపీగా ఉన్నారు. ఆమె కేరళ రాజకీయాల్లో చురుగ్గా జోక్యం చేసుకోవడం వల్ల ఈ ఎన్నికల ఫలితాలు నేరుగా గాంధీ కుటుంబంపై ప్రభావం చూపుతాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తర్వాత కాంగ్రెస్‌కు బలమైన పట్టున్న రాష్ట్రం కేరళ. ఇక్కడ కూడా వరుసగా మూడో సారి ఓడిపోతే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వ సామర్థ్యంపై ,  గాంధీ వారసుల విన్నింగ్ కెపాసిటీ పై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతాయి.

కాచుక్కూర్చున్న బీజేపీ  

కేరళలో ఇప్పటివరకు ప్రధాన పోటీ కాంగ్రెస్, లెఫ్ట్ కూటముల మధ్యే ఉన్నప్పటికీ, ఈసారి సీన్ మారుతోంది. కాంగ్రెస్ బలహీనపడితే ఆ ఖాళీని భర్తీ చేసేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇప్పటికే క్రైస్తవ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌లో చీలిక వస్తే, అది బీజేపీకి వరంగా మారుతుంది. త్రిముఖ పోటీ ఏర్పడితే అది కాంగ్రెస్‌కు మరింత నష్టదాయకం.

డూ ఆర్ డై.. చివరి అవకాశం 

ఒకవేళ ఈసారి కూడా కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతే, కేరళలో ఆ పార్టీ బెంగాల్ లేదా త్రిపుర తరహాలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండాలంటే విజయం తప్పనిసరి. అందుకే ఈసారి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. లెఫ్ట్ కూటమిని ఎదుర్కోవడానికి మతపరమైన సమీకరణాలను, యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపైనే కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.  కేరళ ఎన్నికలు దేశ రాజకీయాల్లోనే అత్యంత కీలకంగా మారాయి. పినరయి విజయన్ హ్యాట్రిక్ కొడతారా? లేక కాంగ్రెస్ తన పాత వైభవాన్ని చాటుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. కాంగ్రెస్‌కు ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు  అనే పరిస్థితి. ఈ పోరులో గెలిస్తేనే రాహుల్ గాంధీ నాయకత్వానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది, లేదంటే కేరళ గడ్డపై కాంగ్రెస్ జెండా మరింత పలచబడటం ఖాయం.