What are the chances of BJP in Kerala: కేరళ రాజకీయాల్లో ఎప్పుడూ ఎల్‌డీఎఫ్  , యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి వేగంగా మారింది. గతంలో కేవలం నామమాత్రపు ఉనికి ఉన్న భారతీయ జనతా పార్టీ , ఇప్పుడు కేరళలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి,  కింగ్ మేకర్  పాత్ర పోషించాలని గట్టి పట్టుదలతో ఉంది. 

Continues below advertisement

స్థానిక ఎన్నికల జోరు - మారిన సమీకరణాలు

2025లో జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి కొత్త ఊపిరినిచ్చాయి. ముఖ్యంగా రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌లో  వామపక్షాల 45 ఏళ్ల ఆధిపత్యానికి గండి కొడుతూ, బీజేపీ 50 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ ఫలితాలతో బీజేపీ ఓటు బ్యాంక్ దాదాపు 14.76 శాతానికి కి చేరింది. ఇదే జోరును అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించి, కనీసం 30 శాతం ఓటు షేర్ సాధించాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

Continues below advertisement

కింగ్ మేకర్ వ్యూహం

మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ సారి బీజేపీ కనీసం 15 నుండి 20 స్థానాల్లో గెలుపుపై ధీమాగా ఉంది. ఒకవేళ ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు జరిగి, ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో , తామే కింగ్ మేకర్ కావాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా త్రిస్సూర్  , తిరువనంతపురం, పాలక్కాడ్, కాసరగోడ్ వంటి జిల్లాల్లో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు.

సామాజిక , మతపరమైన సమీకరణాలు

కేరళలో గెలవాలంటే కేవలం హిందూ ఓట్లు సరిపోవని గుర్తించిన బీజేపీ, ఈసారి క్రైస్తవ మైనారిటీలను ఆకట్టుకునేందుకు  సత్సంవాద్  వంటి కార్యక్రమాల ద్వారా వారితో చర్చలు జరుపుతోంది. మరోవైపు ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు, కేంద్ర పథకాల అమలును ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది.  స్థానిక పార్టీలతో పొత్తులు పెట్టుకుని, అభివృద్ధి నినాదంతో ఓటర్ల ముందుకు వెళ్తోంది. కేరళలో గత 50 ఏళ్లుగా సాగుతున్న  రెండు కూటముల  రాజకీయాలను ముక్కలు చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశ్యం.

ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ వ్యూహాలు

బీజేపీ పెరుగుతున్న శక్తిని గమనించిన పాలక ఎల్‌డీఎఫ్, తమ ఓటు బ్యాంక్ చెదిరిపోకుండా సంక్షేమ పెన్షన్ల పెంపు, పేదరిక నిర్మూలన హామీలతో రంగంలోకి దిగింది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా ఇందిరా గ్యారెంటీలు పేరుతో మహిళలు, యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఎల్‌డీఎఫ్-యూడీఎఫ్ రెండూ ఒకే నాణేనికి రెండు పార్శ్వాలని, కేరళ అభివృద్ధికి బీజేపీయే ప్రత్యామ్నాయమని  పొరుగు రాష్ట్ర నేతలను కూడా ప్రచారానికి రప్పిస్తూ బీజేపీ ఒత్తిడి పెంచుతోంది.

ఉత్కంఠభరిత పోరు

ఏప్రిల్ 9, 2026న జరగనున్న పోలింగ్ కేరళ భవిష్యత్తును నిర్ణయించనుంది. బీజేపీ గనుక తన ఓటు షేర్‌ను 20 శాతం దాటించగలిగితే, అది ఎల్‌డీఎఫ్ లేదా యూడీఎఫ్ గెలుపు ఓటములను శాసించే స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే కేరళలో  మెట్రో మ్యాన్  శ్రీధరన్, సురేష్ గోపి వంటి ప్రముఖులను చేర్చుకోవడం ద్వారా బీజేపీ తన ఇమేజ్‌ను మార్చుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేరుగా అధికారం చేపట్టకపోయినా, అసెంబ్లీలో ఒక బలమైన గొంతుకగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కేరళలో బీజేపీ గనుక 15 సీట్లు గెలిస్తే, అది దక్షిణాది రాజకీయాల్లో అతిపెద్ద మలుపు అవుతుంది.