KTR Jagan  Ground Level Workers Activation:  ఎన్నికల ఓటమి అనేది ఎంతటి అగ్రనేతలకైనా ఐదేళ్ల పాటు కమ్మేసిన అధికార అహాన్ని దించి, ఒకేసారి కళ్లు తెరిపిస్తుందనేది అక్షరాలా నిజం. నిన్నటివరకు ముఖ్యమంత్రులుగా, పవర్‌ఫుల్  మంత్రులుగా చక్రం తిప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారత్ రాష్ట్ర సమితి  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం ఒకే విధమైన పశ్చాత్తాప ప్రకటనలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాము అధికారంలో ఉన్నప్పుడు పార్టీని, తమను నమ్ముకుని జెండాలు మోసిన గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను తీవ్రంగా నిర్లక్ష్యం చేశామని, వారిని కలవకుండా దూరం పెట్టామని ఇద్దరు నేతలూ బహిరంగంగానే అంగీకరిస్తున్నారు.  మళ్లీ మమ్మల్ని గెలిపించండి.. భవిష్యత్తులో అన్నీ మీ చేతుల మీదుగానే చేయిస్తాం.. మీరే మా సర్వస్వం అంటూ తాడేపల్లి, తెలంగాణ భవన్ వేదికలుగా క్యాడర్‌కు సరికొత్త హామీలు ఇస్తున్నారు.

Continues below advertisement

కార్యకర్తల ప్రాధాన్యం గుర్తించిన జగన్, కేటీఆర్ 

రాజకీయాల్లో ఇదొక క్లాసిక్ 'సిండ్రోమ్'. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇటు జగన్ మోహన్ రెడ్డి కి కేవలం తన  కోటరీ నేతలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే సర్వస్వంగా కనిపించారని పార్టీ నేతలు అంటూంటారు.  అటు కేటీఆర్, కేసీఆర్ కూడా  ప్రగతి భవన్ దాటి కార్యకర్తల గోడు వినే తీరిక లేకపోయింది. నాడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అరాచకాలు, అవినీతిని గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్దామన్నా కనీసం అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి ఉండేది. కానీ, ఎప్పుడైతే జనం ఈ రెండు పార్టీలకూ ప్రతిపక్ష హోదా ఇచ్చి కూర్చోబెట్టారో.. అప్పుడు వీరికి మళ్లీ కార్యకర్త ' అనే దేవుడు గుర్తొచ్చాడు. కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెడుతూ   కార్యకర్తలను నిర్లక్ష్యం చేశామని..మరోసారి అలా జరగనివ్వబోమని అంటున్నారు.  జగన్ మోహన్ రెడ్డి కూడా నేరుగా ఇదే మాట చెబుతున్నారు.  

Continues below advertisement

గెలిచినా కార్యకర్తల్ని పట్టించుకోలేరు!  

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా కార్యకర్తలను ట్రీట్ చేయడం అనేది అన్ని రాజకీయ పార్టీల నైజం. ఓడినప్పుడు  నువ్వే నా ప్రాణం అనే లీడర్లు.. గెలవగానే  నువ్వెవరో నేను గుర్తుపట్టను  అన్నట్లు వ్యవహరిస్తారు. ఇక్కడ లాజికల్‌గా ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఒకవేళ భవిష్యత్తులో వీరు మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే.. ఇప్పుడు చెప్తున్నట్లు అన్నీ కార్యకర్తల చేతుల్లోనే పెట్టగలరా? అంటే అది ముమ్మాటికీ అసాధ్యం, కేవలం ఒక మాయమాట మాత్రమే. ఎందుకంటే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. క్షేత్రస్థాయి కార్యకర్తలకు, లోకల్ లీడర్లకు పూర్తిస్థాయిలో అధికారాలు బదిలీ చేస్తే, వారు స్థానికంగా చేసే  పంచాయితీల వల్లే ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని అధినాయకత్వం ఎప్పుడూ భయపడుతుంది. అందుకే, అధికారంలోకి రాగానే లీడర్లు మళ్లీ  అధికార యంత్రాంగం  ని ఆశ్రయిస్తారు, కార్యకర్తలను గేట్ల అవతలే ఉంచుతారు.

విపక్షంలో ఉంటేనే కార్యకర్తలతో పని 

దీనికి నిజమైన విరుగుడు.. కేవలం ఎన్నికల ఓటమి తర్వాత సానుభూతి కోసం పశ్చాత్తాప ప్రకటనలు చేయడం కాదు. క్రమశిక్షణతో కూడిన క్యాడర్ మైండ్ సెట్‌ను   పార్టీ విధానాల ప్రకారం మొదటి నుంచీ తయారు చేయాలి. అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలపై పోరాడేలా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలే తప్ప.. అధికారాన్ని కేవలం ప్రత్యర్థులపై పగ సాధింపు  కోసమో, వ్యక్తిగత సంపాదన కోసమో వాడుకునేలా క్యాడర్‌ను రెచ్చగొట్టకూడదు. ఎప్పుడైతే పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారో.. అప్పుడు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వీగిపోతాయి, ఓడిపోయాక ఇలాగే లెంపలేసుకోవాల్సి వస్తుందని ఇటీవల పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. 

కార్యకర్తల్ని మళ్లీ యాక్టివ్ చేయగలరా?

జగన్, కేటీఆర్ లాంటి అగ్రనేతలు చేస్తున్న ఈ  కార్యకర్తల జపం  కేవలం ప్రస్తుతం చెల్లాచెదురవుతున్న తమ ఓటు బ్యాంకును, వలసపోతున్న క్యాడర్‌ను కాపాడుకునేందుకు వేస్తున్న  రాజకీయ ఎత్తుగడ .  కేవలం మాటలతో కాకుండా నిజంగానే పార్టీ నిర్మాణాన్ని మార్చి, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి సరైన గౌరవం ఇస్తేనే.. రాబోయే ఎన్నికల్లో ఈ పశ్చాత్తాప ప్రకటనలకు కనీస మైలేజ్ లభిస్తుందని అనని రాజకీయ పార్టీల కార్యకర్తల భావన. ఇది వైసీపీ, బీఆర్ఎస్ సమస్య కాదు. అన్నిపార్టీలది. అందరూ  నేర్చుకోవాల్సిందే.