KCR Votes Schemes :  ప్రభుత్వం వద్ద మీ దరఖాస్తు ఉంది.  ఎప్పటికైనా పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉంది. ఆ దరఖాస్తు క్లియర్ అయితే లక్షల సాయం వస్తుంది. అంత కంటే ఇంకేం కావాలి ? ప్రభుత్వానికి మళ్లీ ఓటేయడానికి. ఇంత కంటే ఓటర్ ను ఎమోషనల్ చేసే ఆయుధం ఏమి ఉంటుంది ? వారి ద్గగర నుంచి తీసుకునే ఒక్క దరఖాస్తే ఓట్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అదే ఎమోషనల్ రాజకీయం చేస్తున్నారు. ఎంతగా అంటే..  కనీసం ముఫ్పై శాతం కుటుంబాల నుంచి  ప్రభుత్వ  పథకాల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. మళ్లీ ఈ ప్రభుత్వం వస్తేనే అందరికీ సాయం అందుతుందన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. ఆ సాయం ఆషామాషీగా వందల్లో..వేలల్లో కాదు.. లక్షల్లో ఉంటుందని ఆశ కల్పిస్తున్నారు. 


అన్ని పథకాలకూ వరుసగా దరఖాస్తుల స్వీకరణ


రాజకీయం ఎలా చేయాలో కేసీఆర్‌కు  బాగా తెలుసు. ఓటర్లను ఎలా ట్యూన్ చేయాలో ఆయనకు ఇంకా బాగా తెలుసని రాజకీయవర్గాలు విశ్లేషిస్తూ ఉంటాయి. కేసీఆర్ ఇప్పుడు స్కీములతో రాజకీయ విన్యాసాలు చేస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో గెలుపునకు పథకాలనే ఆధారంగా చేసుకుంటున్నారు. అయితే అవి అమలు చేస్తున్న పథకాలు కాదు.. అమలు చేయబోయే పథకాలు.  వరుసగా  పథకాన్ని ప్రకటించడం.. దరఖాస్తులు తీసుకోవడం కామన్ గా మారిపోయింది. అన్నీ లక్షలు ఇచ్చే పథకాలే. అవి కూడా ఉచితంగా .అందుకే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అన్నింటినీ కాదనుకుండా తీసుకుంటోంది ప్రభుత్వం. స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు రూ. మూడు లక్షలు ఇచ్చే గృహలక్ష్మి పథకాన్ని గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఈ ఎన్నికలకు ముందు దరఖాస్తులు తీసుకున్నారు. ఏకంగా పదిహేడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.   ఇప్పటి వరకూ దళిత బంధు, మైనార్టీ బంధు, బీసీ బంధు సహా అనేక పథకాల అప్లికేషన్లు తీసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల అప్లికేషన్ల గురించి చెప్పాల్సిన పని లేదు. అంటే ప్రతి కుటుంబాల్లో మూడు కుటుంబాలు ప్రభుత్వం వద్ద పథకం కోసం దరఖాస్తు చేసుకుని.. కేసీఆర్ సర్కార్ ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. 


అన్నీ నేరుగా నగదు ఇచ్చే  పథకాలు .. అప్పు కూడా కాదు ఉచితమే !


కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు పూర్తిగా ఉచితమే. దళిత బంధు కింద ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షలు ఇస్తారు. అది పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా లబ్దిదారు వెనక్కి కట్టాల్సిన పని లేదు. అలాగే బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా. ఒక్కో కుటుంబానికి లక్ష ఇస్తారు. అది కూడా అప్పు కాదు. గృహలక్ష్మి కింద రూ. మూడు లక్షలు ఇస్తారు. అంతా ఉచితమే. ఇలాంటి పథకాలకు దరఖాస్తు చేసుకున్న ఎవరికైనా ఆశ మిణుకు మిణుకు ఉంటుంది. ఆ డబ్బులు వస్తే.. అనే ఊహే వారిని గాల్లో విహరింప చేస్తుంది. కానీ అందరికీ ఎన్నికల్లోపు ఇవ్వడం సాధ్యం కాదు. ప్రతి నెలా కొంత మందికి ఇస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెబుతున్నారు. ఇప్పటికే పథకాలు పంపిణీ ప్రారంభించారు. నియోజకవర్గానికి  వంద నుంచి వెయ్యి మంది  వరకూ ఎంపిక చేసి ఇస్తున్నారు. ప్రతీ నెలా ఇస్తారు..ఎన్నికలు మరో మూడు నెలల్లో ఉన్నాయి. అంటే.. ఇంకా  90 శాతానికిపైగా మిగిలిపోతారు. మీకేం భయం వద్ద మన సర్కార్ కు ఓటేయండి.. ప్రభుత్వం మూాడో సారి అధికారంలోకి రాగానే ఇచ్చేస్తామంటారు. అప్లికేషన్ ప్రభుత్వం వద్ద పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిందే. ఇదే కేసీఆర్ మాస్టర్ ప్లాన్.


కానీ ప్రజల్లో అసంతృప్తి పెరిగితే మాత్రం మొదటికే మోసం...!


పథకాల లబ్దిదారులు ఎంతో ఆశగా ఉంటారు. కొంత మందికి ఇచ్చి తమకు ఇవ్వలేదని.. ఎన్నికల తర్వాత ఇస్తారన్న నమ్మకం లేకపోతే.. వారు   రివర్స్  అవుతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారు. హైదరాబాద్‌లో భారీ  వరదలు వచ్చినప్పుడుప్రతి ఇంటికి పది వేలు ఇస్తామన్నారు. ఇవ్వకుండానే గ్రేటర్ ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు అవగానే ఇస్తామన్నారు. కానీ.. ప్రజలు నమ్మలేదు. భారీగా వరదలు వచ్చిన చోట  బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఇలాంటి అపనమ్మకం రిపీటైతే..  పూర్తిగా అంచనాలు తలకిందులు అవుతాయి.