Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Congress Politics: ఇందిరమ్మ ఇళ్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది.కానీ మంజూరు మాత్రం చాలా తక్కువగా ఉంది. రెండో విడత కూడా ప్రారభించిన సమయంలో .. తాము చెప్పిన వారికే ఇళ్లివ్వాలని నేతలు పోరాటానికి దిగుతున్నారు.

Rural Telangana Congress Internal Rifts: తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇందిరమ్మ ఇళ్లు' పథకం ఇప్పుడు పల్లెల్లో తీవ్ర పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఎన్నికల హామీలలో భాగమైన 'ఆరు గ్యారంటీలలో' ఒకటైన ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పథకం ఉద్దేశం అద్భుతమైనదే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మాత్రం గ్రామాల్లో లొల్లికి, అధికార పార్టీలోనే అంతర్గత విభేదాలకు వేదికగా మారుతోంది.
డిమాండ్ వేలల్లో.. కోటా వందల్లో
ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా నియోజకవర్గానికి సగటున 3,500 ఇళ్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. అయితే, గ్రామాల వారీగా చూస్తే ఒక్కో పంచాయతీకి కేవలం 30 నుండి 40 ఇళ్లు మాత్రమే కోటాగా వస్తున్నాయి. కానీ, ప్రతి పల్లెలోనూ దరఖాస్తు చేసుకున్న ఆశావహుల సంఖ్య వేలల్లో ఉండటంతో అసలు సమస్య మొదలైంది. గ్రామంలో అర్హులైన నిరుపేదలు వందల సంఖ్యలో ఉంటే, కేటాయించిన అరకొర ఇళ్లను ఎవరికి ఇవ్వాలో తెలియక స్థానిక అధికారులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు తలలు పట్టుకుంటున్నాయి.
సహాయ నిరాకరణలో అధికారులు - నేతల ఒత్తిళ్లు
గ్రామ సభల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక లీడర్లు, మండల స్థాయి నేతలు తమ అనుచరులకు, ఎన్నికల్లో తమ కోసం పనిచేసిన కేడర్కే ఈ ఇళ్లను కేటాయించాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు, అర్హుల జాబితాలో అనర్హులు ఉంటే రేపు విపక్షాలు రచ్చ చేస్తాయనే భయంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్ని చోట్ల నేతల గొడవలు భరించలేక అధికారులు గ్రామ సభలను వాయిదా వేస్తున్న ఉదంతాలు లోకల్ మీడియాలో హెడ్లైన్స్గా మారుతున్నాయి.
అధికార పార్టీలోనే అంతర్గత గ్రూపు తగాదాలు
ఇందిరమ్మ ఇళ్ల కోటా పంచాయతీ కాస్తా కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలకు, ఇటీవలే పార్టీలోకి వచ్చిన కొత్త నేతలకు మధ్య ఇళ్ల కోటా పంపకాలపై విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల్లో కష్టపడి పార్టీని గెలిపించిన మాకు కాకుండా, మొన్నటికి మొన్న వచ్చిన వారికి ఎక్కువ ఇళ్ల కోటా ఎలా ఇస్తారు?" అంటూ పాత కాంగ్రెస్ క్యాడర్ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తోంది. ఈ అంతర్గత గ్రూపు తగాదాలు కొన్ని గ్రామాలలో బాహాబాహీ తలపడేంత వరకు వెళ్లడం పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. గ్రామాల్లో సాగుతున్న ఈ గందరగోళాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అర్హులైన పేదలను కాదని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే 5 లక్షల రూపాయల సాయం అందిస్తున్నారంటూ వారు పల్లెల్లో ప్రచారానికి తెరలేపారు. గ్రామ సభల్లో నిరసనలు తెలపడం, అర్హుల జాబితాను సవరించాలంటూ కలెక్టరేట్ల ముట్టడికి ప్లాన్ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణ ఓటర్లను సమీకరించే పనిలో పడ్డాయి.
రెండో విడతపైనే మంత్రి పొంగులేటి ఆశలు
ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రంగంలోకి దిగారు. తొలి ఏడాదిలోనే ప్రభుత్వం వేలాది ఇళ్లను పూర్తి చేసిందని, ప్రతి జిల్లాకు అదనంగా మరో 5 వేల ఇళ్లను మంజూరు చేస్తూ రెండో విడతను కూడా వేగవంతం చేస్తామని ఆయన ప్రకటిస్తున్నారు. ఒకే విడతలో అందరికీ ఇళ్లు ఇవ్వడం అసాధ్యమని, దశలవారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కుతుందని స్థానిక నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. "ఇందిరమ్మ ఇళ్లు" పథకం కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజీ తేవాల్సిన స్కీమ్ అయినప్పటికీ, పంపిణీలో జరుగుతున్న వ్యూహాత్మక లోపాల వల్ల అది గ్రామాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. కోటా తక్కువగా ఉండటం వల్ల లబ్ధి పొందిన ఒక్కరి కంటే, లబ్ధి పొందని వంద మందిలో వచ్చే వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తోంది. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ 'ఇళ్ల కోటా' వివాదాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో, క్యాడర్ను ఎలా శాంతింపజేస్తుందో చూడాలి.
Before You Go
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















