Constitutional protection for Amaravati:  ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో అమరావతి  కేవలం ఒక రాజధాని నగరం మాత్రమే కాదు, అది ఒక ఐదు కోట్ల ప్రజల ఆశలకూ, ఆవేదనలకూ ప్రతీకగా మారింది.  ఐదేళ్లుగా ఎదుర్కొన్న అనిశ్చితికి తెరదించుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతికి  కేంద్ర రక్షణ కవచం కల్పించే దిశగా వేస్తున్న అడుగులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.    విభజన చట్టం సవరణ - ఒక శాశ్వత పరిష్కారం 

Continues below advertisement

రాష్ట్ర విభజన చట్టం-2014లో  కొత్త రాజధాని అనే పదం ఉందే తప్ప, స్పష్టంగా  అమరావతి  అనే పేరు లేదు. దీనిని ఆసరాగా చేసుకునే గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల  ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి, దాని ఆధారంగా కేంద్రం విభజన చట్టంలోని సెక్షన్-5ను సవరించడం ద్వారా అమరావతిని  అధికారిక రాజధాని గా గెజిట్‌లో చేర్చనుంది. ఒకసారి చట్టంలో పేరు చేరితే, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి అనుకున్నా దానిని మార్చడం రాజ్యాంగబద్ధంగా దాదాపు అసాధ్యం అవుతుంది. ఇది అమరావతికి ఒక పటిష్టమైన  చట్టబద్ధమైన గ్యారంటీ ని ఇస్తుంది.

 పెట్టుబడులకు భరోసా - ఆర్థిక పరిపుష్టి 

Continues below advertisement

రాజధాని విషయంలో గతంలో ఏర్పడిన గందరగోళం వల్ల అంతర్జాతీయ సంస్థలు, భారీ పరిశ్రమలు ఏపీకి రావడానికి వెనుకాడాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ముద్ర పడటంతో, అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలుగుతుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల రుణాల మంజూరు ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. చట్టబద్ధమైన గుర్తింపు వల్ల అమరావతి కేవలం ఒక పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ఆర్థిక రాజధానిగా ఎదిగేందుకు పునాది పడుతోంది.

 రైతుల్లో పెరిగిన విశ్వాసం - రెండో విడత భూసమీకరణ 

అమరావతి కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతులకు ఈ నిర్ణయం ఒక పెద్ద విజయం. గత ఐదేళ్లుగా వారు చేసిన పోరాటానికి ఇప్పుడు తగిన గుర్తింపు లభించినట్లయింది. రాజధాని మార్పు సాధ్యం కాదన్న స్పష్టత రావడంతో, భూముల విలువలు పెరగడమే కాకుండా, రాజధాని విస్తరణకు అవసరమైన రెండో విడత భూసమీకరణకు కూడా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది రాజధాని నిర్మాణ వేగాన్ని మరింత పెంచుతుంది.    చంద్రబాబు వ్యూహాత్మక విజయం 

ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం పొందడంలో చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించారు.  కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఈ అవకాశాన్ని రాజధాని అస్తిత్వాన్ని కాపాడటానికి వాడుకోవడం ఒక మాస్టర్ స్ట్రోక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.   అమరావతికి లభించబోయే ఈ 'కేంద్ర రక్షణ' కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థిరత్వానికి, అభివృద్ధికి ఒక బలమైన హామీ.  

వైసీపీ విధానమేంటి? అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఏ స్టాండ్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మద్దతు ఇస్తే తమ పాత వాదన తప్పు అని ఒప్పుకున్నట్లవుతుంది, వ్యతిరేకిస్తే అమరావతి ద్రోహులు గా ముద్ర పడే ప్రమాదం ఉంది. అయితే ఎప్పట్లానే సమావేశానికి గైర్హాజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాము అమరావతికి వ్యతిరేకం కాదని ప్రకటనలు చేస్తున్నా.. పరస్పర విరుద్ధమైన ప్రకటనలు తరచూ చేస్తూండటంతో ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది.