Womens vote bank politics: మహిళలకు కాంగ్రెస్ కూటమి వ్యతిరేకం - బీజేపీ చెప్పేది ఇదే - ఎలా కౌంటర్ ఇచ్చుకుంటారు?
Congress and bjp: మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నారనే ముద్రను విపక్షాలపై వేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నించనుంది. దాన్ని తిప్పికొట్టడం కాంగ్రెస్ కూటమికి పెద్ద సవాల్గా మారింది.

Congress alliance is against women: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం కేవలం ఒక శాసనపరమైన విఫలం కాదు, ఇది పోలింగ్ జరగాల్సిన బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దిశను మార్చబోయే ఒక శక్తివంతమైన రాజకీయ అస్త్రం. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ఒకవైపు, ఇండి కూటమి మరోవైపు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నారనే ముద్రను విపక్షాలపై వేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తుండగా, దాన్ని తిప్పికొట్టడం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది.
మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తి
పోలింగ్ దగ్గరకు వచ్చిన తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల శాతం గణనీయంగా పెరిగింది. అనేక ఎన్నికల్లో మహిళలు నిశ్శబ్ద విప్లవంలా మారి అధికార పీఠాలను డిసైడ్ చేస్తున్నారు. మేము మీకు అధికారం ఇవ్వాలని చూస్తే, కాంగ్రెస్ కూటమి అడ్డుకుంది అనే నినాదాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి బీజేపీ ఇప్పటికే భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ నారీ శక్తి సభలు నిర్వహించి, విపక్షాల అసలు రంగు బయటపెట్టాలని ఎన్డీయే వ్యూహకర్తలు భావిస్తున్నారు.
విపక్షాల డిఫెన్సివ్ రాజకీయం
బిల్లు వీగిపోవడానికి విపక్షాల ఐక్యతే కారణమని ప్రజల్లోకి వెళ్తే, అది ఎన్నికల్లో తమకు నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్ కూటమి ఆందోళన చెందుతోంది. అందుకే, మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కేవలం ఓబీసీ మహిళలకు కోటా ఇవ్వకపోవడం, డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం జరగడాన్ని మాత్రమే వ్యతిరేకించాం అని వివరణ ఇచ్చుకోవడానికి విపక్ష నేతలు నానా తంటాలు పడుతున్నారు. అయితే, సంక్లిష్టమైన ఈ సాంకేతిక అంశాలను సామాన్య మహిళా ఓటర్లకు అర్థమయ్యేలా చెప్పడం వారికి కత్తి మీద సాము లాంటిదే.
ఎన్డీయే రెచ్చగొట్టే వ్యూహం
సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే బీజేపీ మద్దతుదారులు విపక్షాలపై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. మహిళల హక్కులను కాలరాస్తున్నారంటూ విపక్ష నేతల ఫోటోలను, ఓటింగ్ వివరాలను వైరల్ చేస్తున్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈ సెంటిమెంట్ను మరింత రగిల్చేందుకు ప్రధాని మోదీ స్వయంగా బహిరంగ సభల్లో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. మహిళా సాధికారతకు తామే ఛాంపియన్లమని నిరూపించుకోవడం ద్వారా మహిళా ఓటు బ్యాంకును గంపగుత్తగా కొల్లగొట్టాలనేది ఎన్డీయే ప్లాన్.
కాంగ్రెస్ కౌంటర్ అటాక్
ఈ దాడిని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ కూడా తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ ఉంటే, పదేళ్ల కాలంలో ఎందుకు ఈ బిల్లును ఆమోదించలేదు ఎన్నికల ముందు డ్రామాలు ఎందుకు " అని ప్రశ్నిస్తోంది. అలాగే, బిల్లులో ఓబీసీ మహిళలకు అంతర్గత రిజర్వేషన్లు కల్పించకపోవడం ద్వారా బీజేపీ వెనుకబడిన తరగతుల మహిళలకు అన్యాయం చేస్తోందని తిరుగుదాడి చేస్తోంది. ఈ కోటాలో కోటా అంశాన్ని బలంగా వినిపించడం ద్వారా మహిళల్లో చీలిక తేవాలని విపక్షాలు యోచిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మహిళా ఓటు బ్యాంకు కోసం సాగుతున్న ఈ హోరాహోరీ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















