RSS ABVP to BJP Politics:  భారత రాజకీయాల్లో  వారసత్వం, కుటుంబ నేపథ్యం అనేది నాయకత్వ అర్హతగా మారిన తరుణంలో, భారతీయ జనతా పార్టీ  మాత్రం కింది స్థాయి కార్యకర్త నుంచి అగ్ర నాయకుడిగా ఎదిగే  సిద్ధాంతానికే మొగ్గు చూపుతోంది. ఇటీవల ప్రకటించిన పార్టీ కొత్త జాతీయ కార్యవర్గంలో సైతం ఈ తరహా క్యాడర్-బేస్డ్ లీడర్‌షిప్‌కే అధిష్ఠానం పెద్దపీట వేసింది. కేవలం ఒక పొలిటికల్ ప్యాషన్ , క్రమశిక్షణ, భావజాలం పట్ల అంకితభావంతో పనిచేసే సాధార‌ణ కార్యకర్తకు కూడా నంబర్-1 స్థానాన్ని అధిష్టించే అవకాశం కల్పించడమే తమ శ్రేణుల బలం అని బీజేపీ మరోసారి రుజువు చేసింది.

Continues below advertisement

బీజేపీలో కింది స్థాయి నుంచే నేతలు

ఈ గ్రాస్‌రూట్ మోడల్ కు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే అతిపెద్ద ఉదాహరణ. గుజరాత్‌లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా, సాదాసీదా కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎదిగిన విధానం బీజేపీ సిద్ధాంతానికి నిలువెత్తు సాక్ష్యం. తాజాగా పార్టీ అత్యున్నత అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన నితిన్ నబీన్ ప్రయాణం కూడా ఇందుకు భిన్నమైనది కాదు. యువజన మోర్చా స్థాయి నుంచి సుదీర్ఘకాలం పాటు క్షేత్రస్థాయిలో చెమటోడ్చి, కష్టపడి పనిచేసిన నైపుణ్యాన్ని గుర్తించే పార్టీ జాతీయ నాయకత్వ పగ్గాలను ఆయనకు అప్పగించింది.

Continues below advertisement

సిద్ధాంతం కోసం పని  చేసే నైజం

కొత్త జాతీయ కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా ఎంపికైన రామ్ మాధవ్ ,  ఆల్ సెల్స్ కో కన్వీనర్‌గా స్థానం పొందిన విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతల ప్రయాణం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల పునాదుల మీదే సాగింది. రామ్ మాధవ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో క్షేత్రస్థాయి స్వయంసేవక్‌గా పొలిటికల్ డిప్లొమసీని, సిద్ధాంత పటిష్టతను నేర్చుకుని బీజేపీ జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారారు. అలాగే ఏపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి విద్యార్థి విభాగమైన ఏబీవీపీ  ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇవి కేవలం ఉద్యోగ బాధ్యతలు కావు, సిద్ధాంతం పట్ల ఉండే 'ప్యాషన్'.

ఫలితాలే ప్రాతిపదికగా గుర్తింపు 

అధికార మార్పిడి , పదవుల పంపకంలో  వారసత్వ రాజకీయాల ను పూర్తిగా పక్కనపెట్టడం బీజేపీకి సంస్థాగతంగా కొన్ని ప్రధాన ప్రయోజనాలను తెచ్చిపెడుతోంది.  ఏ మూలన ఉన్న సాధారణ శ్రేణి నేతలకైనా,  నేను కూడా రేపు జాతీయ స్థాయి నేతను కాగలను  అనే ఆశ, ఉత్సాహం నిరంతరం పని చేసేలా ప్రేరేపిస్తాయి. పక్షపాతం లేకుండా పనితీరు, ఫలితాలే ప్రాతిపదికగా ప్రమోషన్లు ఇవ్వడం వల్ల పార్టీ నడిపించే వ్యూహకర్తలకు క్షేత్రస్థాయి సమర్థత దక్కుతుంది.  ప్రత్యర్థి పార్టీలలో నడుస్తున్న  కుటుంబ పాలన ను నిలదీసే నైతిక బలం ఒక్క బీజేపీకే సాధ్యమవుతుంది.

కొన్ని సవాళ్లు కూడా !

 ఈ గ్రాస్‌రూట్ నాయకత్వ నమూనాలో కొన్ని అంతర్గత సవాళ్లు కూడా లేకపోలేదు. క్షేత్రస్థాయి నుంచి కష్టపడి వచ్చిన నేతలకు సిద్ధాంతపరమైన నిబద్ధత ఉన్నప్పటికీ, ఎన్నికల సమయంలో విభిన్న సామాజిక సమీకరణాలను, గ్లామరస్ పాపులిజమ్‌ను తట్టుకుని ఓట్లుగా మలచడం ఒక్కోసారి క్లిష్టంగా మారుతుంది. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చే మాస్ లీడర్లకు, కింది స్థాయి నుంచి ఎదిగిన ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్  ఉన్న 'ఆర్గనైజేషనల్' నేతలకు మధ్య సమన్వయం కుదర్చడం జాతీయ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారుతుంటుంది. బీజేపీ నిలకడగా విజయం సాధించడానికి, ఇతర ప్రాంతీయ పార్టీల వలె ఏ ఒక్క కుటుంబం చేతిలో చిక్కుకోకుండా ఉండటానికి ఈ  బాటమ్-టు-టాప్ విధానమే మూలస్తంభం. రాజకీయాన్ని వ్యాపారంగా కాకుండా ఒక బాధ్యతగా, ప్యాషన్‌గా భావించి రూట్ లెవెల్ నుంచి కష్టపడే వారికి బీజేపీలో ఎల్లప్పుడూ ప్రాధాన్యత దక్కుతుందనే సందేశాన్ని సరికొత్త జాతీయ కార్యవర్గ ఎంపిక మరోసారి స్పష్టంగా చాటిచెప్పింది.