Conngress PCC Chief YS Sharmila News:  ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో రోజుకో  మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య జరుగుతున్న ఫైట్‌లో షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్‌ కూడా చేరింది. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన షర్మిల ఏపీలోకి వచ్చీరాగానే స్పీడ్ పెంచేశారు. పీసీసీ పగ్గాలు తీసుకున్న ఆమె... అన్నపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ రోజుకో షాక్ ఇస్తున్నారు. 


సునీతతో షర్మిల భేటీ 


పీసీసీ చీఫ్‌ షర్మిల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రోజుకో కొత్త విషయంతో జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. తనను ఒంటరిని చేసిన విషయం, ఇంటి తగాదాలు అన్నింటిపై సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఆమె మరో అడుగు ముందుక వేశారు. షర్మిల బాబాయి, వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో సమావేశమయ్యారు. కడప కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి భేటీకి వెళ్లిన షర్మిల... ఇడుపుల పాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధికి నివాళి అర్పించారు. అనంతరం సునీతతో సమావేశమయ్యారు. 


భేటీతో అనేక ప్రచారాలు 


షర్మిల ఇప్పటి వరకు చాలా అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. కుటుంబ వ్యవహారాలు, పార్టీ అంశాలు, ప్రజా సమస్యలు ఇలా ప్రతి ఒక్కదాంట్లో జగన్‌ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు. జగన్‌, అవినాష్ రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ అయిన వైఎస్‌ వివేక హత్యపై ఇంత వరకు స్పందించలేదు. ఆ అంశాన్ని కూడ ఇంత వరకు టచ్‌ చేసింది లేదు. ఇప్పటి వరకు ఎందుకు ఆ విషయంలో రియాక్ట్ కాలేదన్న ఓ వైపు జరుగుతున్న టైంలో సునీతతో షర్మిల భేటీ ప్రాధాన్యత సంతరిచుకుంది. 


ఏం మాట్లాడుకున్నారు?


సునీత, షర్మిల భేటీలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో తెలియదు కానీ దీనిపై రకరకాల ఊహానాలు జరుగుతున్నాయి. సునీత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం నడుస్తోంది. ఆమెను కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలపాలనే ఆలోచనలో షర్మిల ఇతర నేతలు ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి స్పందన మాత్రం లేదు. ఈ భేటీ తర్వాత ఎవరూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.