AP Municipal Elections TDP vs Janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నామినేటెడ్ పదవులు, సీట్ల సర్దుబాటు కోణంలో అధికార కూటమికి ఒక పెద్ద రాజకీయ పరీక్షగా మారబోతున్నాయి. పార్టీ సమావేశాల్లో స్థానిక పోరుపై దిశానిర్దేశం చేసిన జనసేనాని పవన్ కల్యాణ్, గత అసెంబ్లీ ఎన్నికల నాటి పాత సీట్ల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదని, తాము ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా జనసేన 21 స్థానాలకే పరిమితమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో వార్డు, పంచాయతీ, ఎంపీటీసీ స్థాయిల్లో పార్టీ బలం పెరిగిందని, తమ కేడర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఎక్కువ స్థానాలు ఆశిస్తున్నామని ఆయన తేల్చిచెప్పడం కూటమి వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
కింది స్థాయి క్యాడర్ ఆశలు తీర్చడం కష్టమే
అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో అగ్రనాయకత్వం కూర్చొని నిర్ణయాలు తీసుకుని పొత్తులు ఖరారు చేయడం సులువే అయినప్పటికీ, స్థానిక ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ పరిణామాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉనికి కోసం పోరాడుతున్న ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు తమ ఉనికిని కాపాడుకోవడానికి స్థానిక ఎన్నికలనే ప్రధాన వేదికగా భావిస్తారు. నాయకులు తమకు బలం ఉందనుకున్న చోట టికెట్ దక్కకపోతే పొత్తులను పక్కనబెట్టి స్వతంత్రులుగా లేదా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగడానికి సిద్ధపడతారు. ఈ వాతావరణం కూటమి సమన్వయానికి ప్రధాన సవాలుగా మారనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మైత్రి కోసం త్యాగం చేసిన స్థానిక నేతలు.. ఇప్పుడు మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తమకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక కమిటీని నియమించిన పవన్
జనసేన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 100% సక్సెస్ రేటు సాధించడంతో క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కేడర్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో జనసేన స్థానిక నేతలు వార్డులు, సర్పంచ్ స్థానాల్లో పోటీకి తీవ్ర ఉత్సాహం చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా స్థానిక ఎన్నికల వ్యూహం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, బలాబలాలపై నివేదిక తెప్పించుకుంటున్నారు. తద్వారా తమ ఉనికిని, ఓటు బ్యాంకును స్థానిక సంస్థల్లో సైతం పటిష్టం చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.
టీడీపీలో చాన్స్ దక్కకపోతే రెబల్స్ ఎక్కువ
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ అత్యంత బలమైన కేడర్, నెట్వర్క్ కలిగిన తెలుగుదేశం పార్టీ కూడా స్థానిక పీఠాలను వదులుకోవడానికి సుముఖంగా లేదు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన గ్రామ స్థాయి నాయకులను పక్కనపెట్టి జనసేనకు స్థానాలు కేటాయిస్తే సొంత పార్టీలోనే తిరుగుబాటు వస్తుందనే భయం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జుల్లో ఉంది. పెద్దలు కుదిర్చినా, క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నాయకులు పరస్పరం పోటీ పడే వాతావరణం కనిపిస్తుండటంతో.. అనేక చోట్ల స్థానిక పోరు టీడీపీ వర్సెస్ జనసేన గా మారే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
ఫ్రెండ్లీ కాంటెస్ట్లు తప్పవా?
ఈ పరిస్థితిలో కూటమి అగ్రనాయకత్వమైన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ముందర రెండు ప్రధాన ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి, వివాదాలు లేని చోట అధికారికంగా సీట్లు సర్దుబాటు చేసుకోవడం; రెండవది, తీవ్ర పోటీ ఉన్న స్థానాల్లో ఇరు పార్టీలు సఖ్యతతో "ఫ్రెండ్లీ కాంటెస్ట్" వెళ్లడం. అయితే ఫ్రెండ్లీ కాంటెస్ట్ పేరుతో బరిలోకి దిగితే, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఈ చీలికను అనుకూలంగా మార్చుకుని గెలిచే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా కూటమి పెద్దల్లో ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత ఐక్యతకు, సమన్వయానికి పెద్ద పరీక్ష కానున్నాయి. ఇరు పార్టీల అధినేతలు కేడర్ అసంతృప్తిని చల్లార్చి, సీట్ల సర్దుబాటును ఎంత సజావుగా పూర్తి చేస్తారనే దానిపైనే స్థానిక సంస్థల్లో కూటమి సాధించే విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
