AP Congress PCC Cheif Sharmila Targets Modi: ఏపీ పీసీసీ చీఫ్‌గా రాష్ట్రంలో అడుగుపెట్టిన వెంటనే తన తొలి స్పీచ్‌లోనే మోదీ, బీజీపీపై ఘాటు విమర్శలు చేశారు వైఎస్ షర్మిల. ఇది మాత్రం ఎవ్వరూ ఊహించని విషయంగా ఏపీ కాంగ్రెస్ శ్రేణులు, ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. ఆ ప్రసంగంలో ఆమె బీజీపీ ఒక మతతత్వ పార్టీ, ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తుంది అంటూ డైరెక్ట్ ఎటాక్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ అన్యాయం చేశారన్నారు. అంతటితో ఆగకుండా ఒక్కరోజు గ్యాప్‌లో రాహుల్ గాంధీనీ అసోంలో అవమానించారు అంటూ మరింత రెచ్చిపోయారు షర్మిల. ఏకంగా మోదీకి వ్యతిరేకంగా విశాఖలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేశారు. మోదీ నిరంకుశ పాలన పోవాలి అంటూ నినాదాలు చేశారు. 


గత ఐదేళ్లుగా ఆంధ్రా గడ్డపై ఏ ప్రధాన పార్టీ నాయకుడూ కనీసం కలలో కూడా అనడానికి సాహసించనీ మాటలు అవి. ఈ దేశం అందరిదీ కాదా? కేవలం బీజీపీ RSS మాత్రమే ఉంటాయి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు షర్మిల. దీనితో ఏపీలో తన టార్గెట్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అయ్యుంటారని అనుకున్న పార్టీ నేతలకు కేంద్ర స్థాయిలో మోదీ నీ కూడా లక్ష్యంగా చేసుకున్నారన్న క్లారిటీ వచ్చేసింది. అయితే అదే సమయంలో ఏపీలోనీ మిగిలిన పార్టీల నేతలతో..ముఖ్యంగా బాబు,జగన్,పవన్‌తో పోల్చి చూస్తున్నారు.


మోదీ,బీజీపీపై నోరు మెదపని ఆంధ్రా నాయకులు
2014-19 టైంలో ఏపీలో ప్రధాన పార్టీల నేతలు కాస్తో కూస్తో మోదీపై గట్టిగానే మాట్లాడేవారు. పొత్తు నుంచి బయటకు వచ్చేసిన నాటి ఏపీ సీఎం చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు అంటూ మోదీకి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలు చేసిన విషయం తెలిసిందే. నాటి ప్రతిపక్ష నేత జగన్ అయితే నాకు పూర్తి స్థాయిలో ఎంపీలను ఇవ్వండి ఢిల్లీ మేడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని అన్నారు. పవన్ సంగతి సరేసరి. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ పేరుతో పాచిపోయిన లడ్డూలు ఏపీ మొఖాన బీజీపీ కొట్టింది అంటూ సభలు సైతం పెట్టారు .


2019 ఎన్నికల తర్వాత మారిపోయిన సీన్
2019 జనరల్ ఎన్నికల్లో మోదీ ఓడిపోతారు అనుకున్న నేతలకు మోదీ తిరుగులేని గెలుపు షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. పవర్ కోల్పోయిన చంద్రబాబు మోడీని మంచి చేసుకునే పనిలో పడిపోతే.. కావాల్సినన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నా.. ఏపీలో అధికారం చేపట్టినా జగన్ మాత్రం మోదీ,బీజీపీని ఏమీ అనరు. కారణం ఆయన మెడకు చుట్టుకున్న కేసులే అంటారు ఎనలిస్ట్‌లు. ప్రత్యేక హోదా లాంటి విషయాలు పక్కన బెడితే బీజీపీకి అవసరం అయినప్పుడల్లా పార్లమెంట్‌లో మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఇక పవన్ అయితే మరీ దారుణం. తన పార్టీ పోరాటాన్ని బీజీపీ ఇచ్చే రూట్  మ్యాప్‌తో సాగిస్తాను అనే స్థితిలో ఉన్నారు. పైగా మోదీ మరోసారి కేంద్రం పగ్గాలు చేపట్ట వచ్చు అంటూ అంచనాలు వెలువడుతున్న వేళ ఇప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా గొంతు విప్పే ప్రయత్నం ఏపీ లీడర్లు చెయ్యరు అనే భావం జనంలో బలంగా ఉంది.


నా రూటే సెపరేట్ అంటున్న షర్మిల
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మాత్రం మోదీని బలంగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ ఎంపీలు కూడా మోదీ గుప్పిట్లోనే ఉంటారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మణిపూర్ అల్లర్ల విషయాన్ని తన స్పీచ్‌లో ప్రస్తావించారు. అసలు దేశానికి బీజీపీ అవసరం లేదనీ.. ఏపీకి కూడా రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ లాంటి అంశాల్లో అన్యాయం చేసింది అంటూ ఘాటు విమర్శలే చేశారు. ఇంతిలా బీజీపీనీ, మోదీని టార్గెట్ చెయ్యడానికి షర్మిల వద్ద ఉన్న ఒకే ఒక కారణం ఉనికి కోసం పోరాటం అంటున్నారు ఎన లిస్ట్‌లు. 


విభజనకు కారణమైందన్న కోపం కాంగ్రెస్‌పై ఎంత ఉందో... బీజేపీపై కూడా అంతకు మించి ఉందని విశ్లేషకుల భావన. విభజన తర్వాత రావాల్సిన అంశాల్లో అన్యాయం చేసిందని బీజీపీపై అసహనం ఉంది. దీన్ని ఏపీ లీడర్లు గమనించి కూడా బీజీపీకి వ్యతిరేకంగా మాట్లాడే స్థితిలో లేరు. ఈ ఎన్నికల సమయంలో ఇలా మాట్లాడటం ద్వారా ప్రజల్లో ఓ మేర విశ్వాసం పొంది మళ్లీ కాంగ్రెస్‌కు ఊపిరి పోయడమే షర్మిల స్ట్రాటజీ. ఏదేమైనా..ఏపీలో బీజీపీ విషయంలో బాబు, జగన్, పవన్ చెయ్యలేని పనిని షర్మిల ఈజీగా చేస్తున్నారని జనాల్లో మొదలైంది అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.