AP Bjp Chief Purandeswari Response on Alliance: రాష్ట్రంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే పొత్తులని బీజేపీ (Bjp) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. టీడీపీ - జనసేనతో పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను  ప్రారంభించిన సందర్భంగా ఆదివారం ఆమె పొత్తులపై స్పందించారు. టీడీపీ - జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడడం సంతోషకరమని.. రాష్ట్రంలో అరాచక అంతానికి అందరూ కలవాలని ఆమె పిలుపునిచ్చారు. సీట్ల విషయంలో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలు పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు.


ప్రచారానికి సిద్ధం


అటు, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. టీడీపీ - జనసేన సంయుక్తంగా ఇటీవల సభ ఏర్పాటు చేయగా భారీ స్పందన వచ్చింది. అటు, అధికార వైసీపీ సైతం 'సిద్ధం' పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకెళ్తోంది. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం ప్రచారం ముమ్మరం చేశారు. నిన్నటి వరకూ 'రా.. కదలిరా' పేరుతో చంద్రబాబు సభలు నిర్వహించగా.. శంఖారావం పేరిట నారా లోకేశ్ ప్రజలతో మమేకమయ్యారు. కొద్ది రోజుల్లో 'ప్రజాగళం' పేరుతో చంద్రబాబు మలివిడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సైతం ప్రచారంలో దూసుకెళ్లేందుకు ప్రణాళిక రచించింది. ఇందుకోసం బీజేపీ ప్రచార రథాలను పురంధేశ్వరి ఆదివారం ప్రారంభించారు. మరోవైపు, మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారనే అంశంపై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనుంది. 


సుదీర్ఘ చర్చలు.. పొత్తుపై క్లారిటీ 


ఢిల్లీలో రెండు విడతలుగా చంద్రబాబు, పవన్ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. పొత్తుల అంశంపై శనివారం స్పష్టత వచ్చింది. టీడీపీ 17 పార్లమెంట్ స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో, జనసేన 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాలు ఫిక్స్ చేశారు. రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. ఏపీ అసెంబ్లీ స్థానాల్లోనూ లెక్క కుదిరింది. టీడీపీ 145 స్థానాల్లో పోటీ చేయనుండగా.. బీజేపీ, జనసేనకు కలిసి 30 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో ఇరవై నాలుగు స్థానాల్లో  జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. అయితే త్వరలోనే అభ్యర్థుల రెండో జాబితాపై భేటీ కానున్నారు.


జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి కేంద్రం సహకారం అవసరమని నేతలకు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా కొందరికి సీట్లు రాకపోతే నిరుత్సాహపడొద్దని, పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలని పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చిందని... త్వరలోనే మరోసారి భేటీ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 


ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని మోదీ?


టీడీపీ, జనసేన ఈనెల 17న చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. టీడీపీ - జనసేన - బీజేపీతో పొత్తు కుదరడంతో మూడు పార్టీలు కలిసి ఈ సభను నిర్వహించనున్నాయి. ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ 17న ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ ఉంటే, 18కి బహిరంగ సభ వాయిదా వేస్తారని వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, మరోసారి ఎన్డీఏలోకి టీడీపీ చేరిన తరువాత నిర్వహిస్తున్న సభ కావడంతో భారీగా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. 


Also Read: AP Politics: బీజేపీతో ఎందుకు విడిపోయారు? ఎందుకు కలిశారు? కూటమి నేతలు ప్రజల్ని ఎలా ఒప్పిస్తారు?