BRS MLC Kavitha: పోస్టుకార్డుల ఉద్యమం మొదలుపెట్టిన ఎమ్మెల్సీ కవిత, సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బస్తీ మే సవాల్ అంటాడు.. మరుసటి రోజే పరార్ అవుతాడు..’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట మీద నిలబడే నేత కాదని అన్నారు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరులో స్థానిక మహిళలతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డులు పోస్ట్ చేశారు. అక్కడ ముందుగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. షాద్ నగర్ నుంచే పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
వృద్ధులు, వికలాంగులు, మహిళలు సహా ఇతర పింఛన్లు పెంచేలా సోనియా గాంధీ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత తన పోస్టు కార్డుల ద్వారా కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సార్లు రైతు బంధు (Rythu Bharosa) డబ్బులను ఎగవేసిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తున్నామని పేరు చెప్పి బస్సుల సంఖ్య తగ్గించారని ఆరోపించారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత బస్సు అమలుచేస్తూనే.. బస్సు ల సంఖ్య పెంచాలని కవిత డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క కాకునూరు గ్రామానికి చెందిన మహిళలకే ఈ 18 నెలల్లో 5 కోట్ల రూపాయలు బాకీ పడ్డారని, అడబిడ్డలకు స్కూటీలు ఇప్పించేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ కింద రూ.1 లక్షతో పాటు తులం బంగారం సైతం ఇస్తామన్న ఎన్నికల హామీ ఏమైందని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. సీఎం రేవంత్ కేసీఆర్ జపం చేసుడు తప్ప ఇంకెం చేస్తున్నారని కవిత ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలోనే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆమె ఆరోపించారు. కొడంగల్ (Kodangal) ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో ఒక్క తట్ట మట్టి తియ్యకుండానే కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఇచ్చారని ఆరోపించారు. అప్పు చేసిన రూ.2 లక్షల కోట్లను సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఏం పథకాలు ప్రవేశపెట్టకున్నాపర్వాలేదు, కానీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పెట్టిన పథకాలను కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని ఆందోళన వ్యక్తం చేశారు.