Youth Congress members shirtless protest at AI Summit : ఇండియా సాంకేతిక నైపుణ్యాన్ని, ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ను నిర్వహిస్తోంది. ప్రపంచ దేశాల ప్రతినిధులు, టెక్ దిగ్గజాలు హాజరైన ఈ వేదికపై భారత్ ఒక గ్లోబల్ పవర్హౌస్గా ఎదుగుతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. దేశాభివృద్ధిని ప్రతిబింబించే ఇటువంటి కార్యక్రమాల్లో హుందాతనం ప్రదర్శించాల్సింది పోయి, రచ్చ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
యూత్ కాంగ్రెస్ నేతలు సమ్మిట్ వేదిక వద్దకు చేరుకుని ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పేసి, అర్ధనగ్నంగా నినాదాలు చేస్తూ అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించారు. ఈ ఆందోళన తీవ్ర విమర్శల లాపలవుతోంది.
గ్లోబల్ లీడర్లు హాజరైన సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం భారత్ను అంతర్జాతీయ స్థాయిలో తలవంచుకునేలా చేయడమేనని ఐటీ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, దేశ గౌరవం ముడిపడి ఉన్న వేదికలను ఇందుకు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్న తరుణంలో, ఈ విధమైన విధ్వంసకర రాజకీయాలు కేవలం దేశం విఫలమవ్వాలని కోరుకునే శక్తులకే మేలు చేస్తాయని బీజేపీ ఆరోపిస్తోంది. సాంకేతిక రంగంలో భారత్ అగ్రగామిగా ఎదగాలని కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షిస్తుంటే, కేవలం రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రతిష్టను దెబ్బతీయడం ఏమాత్రం సమర్థనీయం కాదని విమర్శకులు పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, దేశ గౌరవాన్ని పణంగా పెట్టడం సరికాదని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటనను జాతీయ అవమానం గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశం మనందరిది.. రాజకీయం కంటే దేశ ప్రతిష్ట ముఖ్యం అంటూ బీజేపీ మద్దతుదారులు కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. భారత్ సాధిస్తున్న విజయాలను చూసి గర్వపడాల్సింది పోయి, ప్రపంచ వేదికలపై ఇలాంటి వికృత చేష్టలతో అపహాస్యం చేయడం దురదృష్టకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
