Pakistan: పాకిస్తాన్లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Terrorists in Pakistan: పాకిస్థాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు. వారి హత్యల వెనుక ఉన్న ధురంధర్ ఎవరో పాకిస్తాన్కు అర్థం కావడం లేదు.

Serial killings of India most wanted terrorists in Pakistan: పాకిస్థాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు. గత రెండేళ్లుగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ప్రమాదకర సంస్థలకు చెందిన అగ్రనేతలు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. లాహోర్ నుంచి కరాచీ వరకు, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతాల్లోనే ఈ హత్యలు జరుగుతుండటం పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మిస్టరీ కిల్లర్స్ ఎవరనేది ఇప్పటికీ ఒక చిక్కుముడిగానే మిగిలిపోయింది.
ఈ జాబితాలో ఇటీవలే లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హమ్జా చేరాడు. అతనిపై లాహోర్లో కాల్పులు జరిగాయి. అంతకుముందు 2016 పఠాన్కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ సియాల్కోట్లో, 1999 ఐసీ-814 విమానం హైజాకర్ మిస్త్రీ జహూర్ ఇబ్రహీం కరాచీలో కాల్పుల్లో మరణించారు. అలాగే ఖలిస్థానీ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పంజ్ వార్ కూడా లాహోర్లో తన మార్నింగ్ వాక్ సమయంలోనే హతమయ్యారు. దాదాపు 20 మందికి పైగా ఉగ్రవాదులు ఇలాగే వేర్వేరు సందర్భాల్లో హత్యకు గురవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ హత్యల వెనుక భారత నిఘా సంస్థ రా హస్తం ఉందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. దుబాయ్ వంటి మూడో దేశాల్లో స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసి, స్థానికులను ఉపయోగించి ఈ ఆపరేషన్లను భారత్ నిర్వహిస్తోందని పాక్ విదేశాంగ శాఖ వాదిస్తోంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ అంతర్జాతీయ పత్రిక ది గార్డియన్ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది. విదేశీ గడ్డపై ఉన్న ఉగ్రవాదులను ఏరివేసే కొత్త వ్యూహాన్ని భారత్ అమలు చేస్తోందని ఆ పత్రిక పేర్కొంది. అయితే భారత్ ఈ ఆరోపణలను అధికారికంగా తోసిపుచ్చింది.
DHURANDHAR 3 🔥🗿
— Jeet (@JeetN25) April 16, 2026
Amir Hamza, Lashkar-e-Taiba's Founding Member, Shot By Unknown Gunmen In Lahore.pic.twitter.com/t0psxqIEXW
మరో ఆసక్తికరమైన కోణం ఏమిటంటే.. ఈ హత్యలు ఉగ్రవాద సంస్థల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల కూడా జరిగి ఉండవచ్చని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిధుల పంపకం , ఆధిపత్య పోరులో భాగంగా ఒక ముఠా మరో ముఠా నేతలను టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ఉగ్రవాదుల వల్ల అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నందున , పాక్ నిఘా సంస్థలే తమకు భారం అనుకున్న వారిని ఇలా క్లీన్ చేస్తున్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి.
కారణం ఏదైనప్పటికీ, ఈ వరుస హత్యలు పాకిస్థాన్లో తలదాచుకున్న ఉగ్రవాదుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఒకప్పుడు స్వేచ్ఛగా తిరిగిన హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి వారు ఇప్పుడు ప్రాణభయంతో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. భారత్కు శత్రువుగా ఉంటే ప్రపంచంలో ఎక్కడున్నా వదిలేది లేదు అనే సంకేతం ఈ ఘటనల ద్వారా వెళ్తోందని సామాన్యులు భావిస్తున్నారు. ఈ తెలియని తుపాకీ గురి ఎప్పుడు, ఎవరిపై పడుతుందోనన్న భయం పాక్ ఉగ్రవాద స్థావరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు




















