Nobel Peace Prize :నోబెల్ ప్రైజ్పై రాజకీయం మొదలుపెట్టిన అమెరికా- సంచలన ప్రకటన చేసిన మచాడో!
Nobel Peace Prize :నోబెల్ శాంతి బహుమతి విన్నర్ మరియా కొరినా మచాడో ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. అధ్యక్షుడు ట్రంప్ కు ఈ విషయంలో క్రెడిట్ ఇచ్చారు.

Nobel Peace Prize : వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. దీంతో నోబెల్ బహుమతికి తానే పెద్ద అర్హుడునని పదేపదే చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల చెదిరిపోయింది. అందుకే రాజకీయ కారణాలతోనే ట్రంప్ను పరిగణలోకి తీసుకోలేదని వైట్హౌస్ నిష్టూరాలు పోయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మరోసారి నోబెల్ శాంతి బహుమతికి తిరస్కరించిన తర్వాత వైట్ హౌస్ నార్వేజియన్ నోబెల్ కమిటీని తీవ్రంగా విమర్శించింది. ప్రపంచ శాంతి కోసం నిజమైన ప్రయత్నాల కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు ఆరోపించారు.
"మరోసారి, నోబెల్ కమిటీ శాంతిపై రాజకీయాలకు ప్రేరేపితమవుతుందని నిరూపించింది" అని వైట్ హౌస్ ప్రతినిధి రాయిటర్స్తో మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక అవార్డు పక్షపాతంతో ఇచ్చారని ట్రంప్ చేస్తున్న ఆరోపణలు మరోసారి పునరుద్ఘాటించారు.
ఈ వివాదం కొనసాగుతున్న టైంలోనే మరియా కొరినా మచాడో కీలక నిర్ణయం తీసుకున్నారు. వెనిజులా సమస్యపై మద్దతు తెలిపినందుకు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతిని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
మరియా కొరినా మచాడో ఏమన్నారు?
మరియా కొరినా మచాడో ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. "వెనిజులా ప్రజలందరి పోరాటానికి దక్కిన గుర్తింపు మా పనిని పూర్తి చేయడానికి ఒక ప్రేరణ. మేము విజయం దరిదాపుల్లో ఉన్నాము. మునుపెన్నడూ లేనంతగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి మేము అధ్యక్షుడు ట్రంప్, యునైటెడ్ స్టేట్స్, లాటిన్ అమెరికా ప్రజలు, ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలపై మా ప్రధాన మిత్రులుగా ఆధారపడుతున్నాము" అని రాశారు.
This recognition of the struggle of all Venezuelans is a boost to conclude our task: to conquer Freedom.
— María Corina Machado (@MariaCorinaYA) October 10, 2025
We are on the threshold of victory and today, more than ever, we count on President Trump, the people of the United States, the peoples of Latin America, and the democratic…
ట్రంప్పై మరియా కొరినా సంచలన వ్యాఖ్యలు
"వెనిజులా బాధిత ప్రజలకు, మా లక్ష్యానికి ఆయన చేసిన నిర్ణయాత్మక మద్దతుకు నేను ఈ అవార్డును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అంకితం చేస్తున్నాను" అని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించినందుకు, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత మార్పు కోసం పోరాడినందుకు మరియా కొరినా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతిని అందించాలని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయించింది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి చాలా చర్చనీయాంశమైంది. పాకిస్తాన్, ఇజ్రాయెల్, రష్యా, అజర్బైజాన్, థాయిలాండ్, అర్మేనియా, కంబోడియా వంటి అనేక దేశాలు అమెరికా అధ్యక్షుడిని నామినేట్ చేశాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఈ సంవత్సరం 338 నామినేషన్లు వచ్చాయి, వీటిలో 94 సంస్థలు, వివిధ రంగాలకు చెందిన 244 మంది ఉన్నారు.
సంక్షోభంలో ఉన్న తన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మచాడో అవిశ్రాంత పోరాటం చేసినందుకు నోబెల్ కమిటీ శాంతి బహుమతితో గౌరవించింది. "భారీ సంఖ్యలో దేశాలు నిరంకుశత్వంలోకి జారిపోతున్న సమయంలో" కమిటీ ఆమెను ఆశాకిరణంగా అభివర్ణించింది.
మచాడోకు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ (సుమారు $1.2 మిలియన్లు) బహుమతి డబ్బు అందుతుంది. "వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడానికి నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి" ఆమెను ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో తెలిపింది.
ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న సంఘర్షణల్లో శాంతికి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ట్రంప్ చేసిన వాదనకు, లాటిన్ అమెరికాలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మచాడో చేస్తున్న పోరాటానికి మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ఈ నిర్ణయం నొక్కి చెబుతుంది.





















