Kim Jong Un Legacy: ఉత్తరకొరియా కిమ్ కుటుంబంలో వారసత్వ చిచ్చు - కూతురికి కిమ్ కిరీటం - తిరుగుబాటుకు సోదరి రెడీ !
North Korea: ఉత్తరకొరియా నియంత కుటుంబంలో చిచ్చు ప్రారంభమయింది. కూతుర్ని వారసురాలిగా ప్రకటించడానికి కిమ్ రెడీ అయ్యారు. కానీ ఆయన సోదరి వ్యతిరేకిస్తున్నారు.

Kim Jong Un Family Controversy: రాజకీయ అధికారం కోసం కుటుంబాల్లో చిచ్చు రేగడం అనేది కొత్త కాదు. ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల నుంచి ఉన్నదే. మన దేశంలో.. మన రాష్ట్రాల్లోనూ ఇవి చూస్తున్నాం. ఇప్పుడు ఉత్తరకొరియాలోనూ అదే కనిపిస్తోంది. తిరుగులేని నియంత కిమ్ కుటుంబంలోనూ అధికార చిచ్చు రేగింది.
13 ఏళ్ల కూతుర్ని వారసురాలిగా సిద్ధం చేసిన కిమ్
ఉత్తర కొరియా రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహా పోరు మొదలైంది. కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు ఏ ను తన వారసురాలిగా సిద్ధం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తన వెంట తీసుకెళ్తున్నారు. పాలన నేర్పుతున్నారు. దీంతో వారసత్వ ప్రకటనలకు సంకేతాలు వెలువడుతున్నాయి. దక్షిణ కొరియా నిఘా సంస్థ అంచనా ప్రకారం, రాబోయే పార్టీ కాంగ్రెస్ సమావేశాల్లో ఆమెను అధికారికంగా వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉంది. 2022లో మొదటిసారి క్షిపణి పరీక్ష వద్ద కనిపించిన జు ఏ, అప్పటి నుండి తండ్రితో కలిసి సైనిక పరేడ్లు, కర్మాగారాల సందర్శనలు, చివరకు చైనా పర్యటనలో కూడా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది.
కిమ్ సోదరి వ్యతిరేకం - సైన్యంపై పట్టు
ఈ వారసత్వ ప్రయాణంలో కిమ్ సోదరి, అత్యంత శక్తివంతమైన మహిళ కిమ్ యో జోంగ్ ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న యో జోంగ్, ఉత్తర కొరియాలో రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పార్టీలో , సైన్యంలో ఆమెకు గట్టి పట్టు ఉంది. తన పదునైన విమర్శలతో, కఠినమైన నిర్ణయాలతో ఆమె క్రూరమైన అత్త గా పేరు తెచ్చుకున్నారు. ఒకవేళ కిమ్ జోంగ్ ఉన్ తర్వాత అధికారం చేపట్టే అవకాశం వస్తే, ఆమె తన సొంత రాజకీయ ప్రాజెక్టును అమలు చేయడానికి వెనుకాడబోరని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిమ్, సోదరి మధ్య ఉద్రిక్తతలు ఖాయమే!
ఉత్తర కొరియా చరిత్రను గమనిస్తే, అధికార మార్పిడి సమయంలో కిమ్ కుటుంబం చాలా క్రూరంగా వ్యవహరిస్తుంటుంది. గతంలో కిమ్ జోంగ్ ఉన్ తన బాబాయ్ జంగ్ సాంగ్ థేక్ను ఉరితీయించడం, తన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ను మలేషియా విమానాశ్రయంలో రసాయన దాడితో అంతమొందించడం వంటి ఘటనలు ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కూడా చిన్న వయసున్న కుమార్తెను వారసురాలిగా ప్రకటించడం వెనుక, తన కుటుంబ పట్టును మరింత పటిష్టం చేసుకోవాలనే కిమ్ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది.
సోదరి పట్ల కిమ్ క్రూరంగా వ్యవహరిస్తాడా?
పితృస్వామ్య పోకడలు ఎక్కువగా ఉండే ఉత్తర కొరియా నాయకత్వంలో ఒక బాలికను లేదా మహిళను అగ్ర నాయకురాలిగా అంగీకరించడం సవాలుతో కూడుకున్నదే. అయినప్పటికీ, కిమ్ జు ఏను వరుసగా బహిరంగ కార్యక్రమాలకు తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లో , నాయకుల్లో ఆమె పట్ల ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం జరుగుతోంది. రాబోయే రోజుల్లో జు ఏ , యో జోంగ్ మధ్య జరిగే ఈ అధికార పోరాటం ఉత్తర కొరియా భవిష్యత్తును ఎలా మారుస్తుందో అన్నది అంతర్జాతీయ సమాజంలో ఉత్కంఠ రేపుతోంది.























