Iran 10 point response to US : అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ప్రణాళికను తిరస్కరిస్తూ, ఇరాన్ తన సొంత 10 పాయింట్ల ప్రతిపాదన ను పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా వాషింగ్టన్కు అందజేసింది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.
ఐదు వారాలుగా కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ఒక కీలక మలుపు తిరిగింది. తాత్కాలిక కాల్పుల విరమణను తిరస్కరిస్తూ, శాశ్వత ప్రాతిపదికన యుద్ధం ముగియాలని కోరుతూ ఇరాన్ ఒక సమగ్ర ప్రణాళికను వెల్లడించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నప్పటికీ, తమ అంచనాలకు తగ్గట్టుగా లేదని వ్యాఖ్యానించారు.
ఇరాన్ ప్రతిపాదించిన ప్రధాన అంశాలు
ఇరాన్ తన రక్షణ కోసం కఠినమైన షరతులను విధిస్తూనే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సుముఖత వ్యక్తం చేసింది.1. రక్షణ హామీ: భవిష్యత్తులో ఇరాన్పై ఎటువంటి దాడులు జరగవని అమెరికా గ్యారెంటీ ఇవ్వాలి.2. శాశ్వత శాంతి: తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా, యుద్ధాన్ని పూర్తిగా ముగించాలి.3. లేబనాన్పై దాడుల నిలిపివేత: హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తక్షణమే ఆపేయాలి.4. ఆర్థిక ఊరట: ఇరాన్పై ఉన్న అన్ని అమెరికా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలి.5. ప్రాంతీయ సహకారం: ఇరాన్ మిత్రపక్షాలపై జరుగుతున్న దాడులన్నింటినీ నిలిపివేయాలి.
హార్ముజ్ జలసంధి ఫీజు నిబంధన
అమెరికా పెట్టిన డెడ్ లైన్ కారణగా హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకల కోసం ఇరాన్ కొత్త నిబంధనలను తెచ్చింది. హార్ముజ్ జలసంధి దాటే ప్రతి నౌక నుంచి 2 మిలియన్ డాలర్ల ఫీజును వసూలు చేస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ఫీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని పొరుగు దేశమైన ఓమన్తో పంచుకుంటామని తెలిపింది. యుద్ధ పరిహారం కోరడానికి బదులుగా, ఈ ఫీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని యుద్ధంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం కోసం వినియోగిస్తామని స్పష్టం చేసింది.
ఈ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతుండగా, మంగళవారం రాత్రిలోగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించడం ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ ప్రతిపాదనలు యుద్ధాన్ని ముగింపు దశకు తీసుకెళ్తాయా లేక మరింత ఘర్షణకు దారితీస్తాయా అన్నది రానున్న కొన్ని గంటల్లో తేలనుంది.
