Israel Strike on Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ మృతి.. కొనసాగుతున్న ఉద్రిక్తతలు
Iran Israel Conflict | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ తో పాటు బాడీగార్డులు మృతిచెందారని స్థానిక మీడియా పేర్కొంది.

టెహ్రాన్: మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధంలో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ లేబర్ న్యూస్ ఏజెన్సీ ఆదివారం (మార్చి 1) నాడు ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా చేపట్టిన వైమానిక దాడుల్లో మహమూద్ అహ్మదీనెజాద్ మరణించారని పేర్కొంది. ఆయన 2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా సేవలు అందించారు.
ఇరాన్ మాజీ అధ్యక్షుడు మరణంపై ప్రకటన
ఈశాన్య టెహ్రాన్ లోని నర్మాక్ లోని మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ నివాసం లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అందులో ఆయనతో పాటు పలువురు బాడీగార్డులు మరణించారని నివేదిక పేర్కొంది. అధ్యక్షుడు కావడానికి ముందు, అహ్మదీనెజాద్ అర్దబిల్ ప్రావిన్స్ గవర్నర్ గా, టెహ్రాన్ మేయర్ గా సేవలు అందించారు. ఆయన పాశ్చాత్య వ్యతిరేక వైఖరితో గుర్తింపు పొందారు. అహ్మదీనెజాద్ పలుమార్లు ఇజ్రాయెల్ ఉనికిని తీవ్రంగా ఖండించారు. ప్రపంచ పటం నుండి ఇజ్రాయెల్ను తాను తొలగిస్తానని కూడా గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు.
అమెరికా-ఇజ్రాయెల్ లకు ఇరాన్ సమాధానం చెబుతుంది: పేజేష్కియాన్
అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజేష్కియాన్ సంతాపం ప్రకటించారు. అత్యున్నత నాయకుడి మరణం తర్వాత కొత్త నాయకత్వ మండలి తన పనిని ప్రారంభించిందని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ల దాడులకు ఇరాన్ ఆర్మీ గట్టిగా సమాధానం ఇస్తుందన్నారు. ఖమేనీ మరణం కేవలం పశ్చిమ ఆసియా రాజకీయాల్లోనే కాకుండా, 36 సంవత్సరాల పాటు ఇరాన్ పై నియంత్రణను కొనసాగించిన ఆయన పాలనపై కొత్త చర్చను కూడా లేవనెత్తింది. ఖమేనీ ఇరాన్ లో తన పూర్వీకుడు అయతుల్లా రుహోల్లా ఖమేనీ వలె ప్రభావవంతంగా ఉన్నారని చెబుతున్నారు. రుహెల్లా 1979 లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ను స్థాపించి గుర్తింపు పొందారు.
ఖమేనీ మరణం తర్వాత భారత్లో నిరసనలు
అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తరువాత, కాశ్మీర్ నుండి కర్ణాటక వరకు, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో షియా వర్గానికి చెందిన ప్రజలు ఆదివారం వీధుల్లోకి వచ్చి ఈ పరిణామాలపై ఆగ్రహం మరియు దుఃఖాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్ మరియు తెలంగాణాలో కూడా సంతాపం మరియు నినాదాలు చేసిన దృశ్యాలు కనిపించాయి, ఇక్కడ ఖమేనీ పోస్టర్లను పట్టుకున్న నిరసనకారులు అమెరికా మరియు ఇజ్రాయెల్ సైనిక చర్యలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
























