Shivank Awasthi Death News | టొరంటో: కెనడాలో మరో భారత విద్యార్థి హత్యకు గురయ్యాడు. కెనడాలోని టొరంటో నగరంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారత విద్యార్థి శివాంక్ అవస్థిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. 

Continues below advertisement

టొరంటోలోని స్కార్‌బొరౌగ్‌ విశ్వవిద్యాలయంలో  శివాంక్ అవస్థీ చదువుతున్నాడు. స్థానిక హైల్యాండ్‌ క్రీక్‌ ట్రెయిల్‌ వద్ద ఉన్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. దుండగులు ఒక్కసారిగా జరిపిన కాల్పుల్లో బుల్లెట్లు తగిలి తీవ్ర రక్తస్రావమై శివాంక్ అక్కడికక్కడే మృతి చెందారు.

కాలేజీ క్యాంపస్‌ మూసివేత..

Continues below advertisement

ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు వచ్చేలోపే నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనతో స్కార్‌బొరౌగ్‌ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. దర్యాప్తునకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, విద్యార్థుల భద్రత దృష్ట్యా అధికారులు తాత్కాలికంగా కాలేజీ క్యాంపస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు టొరంటో పోలీసులు వెల్లడించారు.

భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి..

ఈ దారుణ ఘటనపై కెనడాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడు శివాంక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇటీవలి కాలంలో విదేశాల్లో, ముఖ్యంగా ఉత్తర అమెరికా దేశాల్లో భారత విద్యార్థులపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు. గత రెండేళ్లలో కెనడా, అమెరికాలో భారతీయ విద్యార్థులపై ద్వేషపూరిత దాడులు (Hate Crimes) లేదా దోపిడీ దాడుల సంఘటనలు భారీగా పెరిగాయి.

ప్రస్తుతం భారత్, కెనడా దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఇటువంటి ఘటనలు జరగడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన నింపుతోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా తిరగవద్దని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే పలుమార్లు అడ్వైజరీలను జారీ చేసింది.