China Dissident Escape:ప్రపంచ చరిత్రలో స్వేచ్ఛ కోసం చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. కానీ 68 ఏళ్ల వయసులో, కేవలం రబ్బరు పడవను నమ్ముకొని అలల ధాటిని తట్టుకొని 30 గంటలపాటు ఒంటరిగా ప్రయాణించిన పోలీస్ గాథ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతటి సాహస ప్రయాణంతో ఒక దేశ సరిహద్దులుదాటడం అనేది ఊహకందని అంశం. చైనాకు చెందిన మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుత రాజకీయ అసమ్మతివాది డాంగ్ గువాంగ్ పింగ్ ఈ గ్రేట్ ఎస్కేప్ సంచలనంగా మారింది.
ఆ 30 గంటలు మృత్యువుతో పోరాటం
చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్లోని వీహై తీరం నుంచి డాంగ్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన చేతిలో ఉన్నది ఒక చిన్న రబ్బరు పడవ మాత్రమే.
ఈ ప్రయాణం సాఫీగా ఏం సాగలేదు. సుమారు 30 గంటలపాటు ఆయన నిద్ర లేకుండా సముద్రం మీద గడిపారు. దక్షిణ కొరియాలోని వెస్ట్రన్ తీరానికి చేరువవుతున్న సమయంలో పడవి ఇంజిన్ చెడిపోయింది. అలల ఉధృతికి ఆ చిన్న పడవ కొట్టుకుపోతుందో తెలియని స్థితి. పైగా 68 ఏళ్ల వయసు. రెండు రోజులుగా కంటి మీద కునుకు లేదు. శరీరం సహకరంచడం లేదు. అదృష్టవశాత్తు, దక్షిణ కొరియాలోని తేన్ కౌంటీ సమీపంలో స్థానిక మత్స్యకారులు ఆయనను గుర్తించి కోస్ట్ గార్డ్కు సమాచారం అందించారు. వారు వచ్చిన ఆయనను రక్షించడంతో ఈ సాహసయాత్ర ఒక కొలిక్కి వచ్చింది.
ఎవరీ డాంగగ్ గువాంగ్పింగ్?
డాంగ్ గువాంగ్పింగ్ ఒకప్పుడు చైనాలోని జెంగ్జౌ నగరంలో పోలీస్ అధికారిగా పని చేశారు. అయితే 1989లో జరిగిన తియానన్మెన్ స్క్వేర్ ఊచకోతకు వ్యతిరేకంగా, ఆ ఘటన జరిగిన పదేళ్ల తర్వాత సంతకాల సేకరణలో పాల్గొనడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ఘటనతో ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. ఫలితంగా ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయారు. 2001లో తన కార్యకలాపాల వల్ల మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. తిరిగి 2014లో తియానన్మెన్ స్మారక కార్యక్రమంలో పాల్గొన్నందుకు అరెస్టు అయ్యారు. చైనాలో ఉంటే తన ప్రాణాలకు ముప్పు ఉందని, కనీసం తన కుటుంబాన్ని కలుసుకోలేనని ఆయనకు అర్థమైంది.
ఇది నాలుగో ప్రయత్నం- పట్టు వదలని విక్రమార్కుడు
డాంగ్ గువాంగ్పింగ్ స్వేచ్ఛ కోసం ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదు.గతంలో మూడుసార్లు ఆయన విఫలమయ్యారు. మొదటి సారి తన భార్య, కుమార్తెతో కలిసి థాయ్లాండ్ పారిపోయి ఐక్యరాజ్యసమితి ద్వారా శరణార్థి హోదా పొందాలని ప్రయత్నించారు. ఆయన కుటుంబానికి కెనడా ఆశ్రయం కల్పించినప్పటికీ, థాయ్ అధికారులు డాగ్ను తిరిగి చైనాకు అప్పగించారు. అక్కడ ఆయనకు మూడేళ్ల ఆరు నెలల జైలు శిక్ష పడింది.
జైలు నుంచి విడుదలయ్యాక, తైవాన్ ఆధీనంలో ఉండే కిన్మెన్ ద్వీపానికి ఈదుకుంటూ వెళ్లాలని రెండోసారి ప్రయత్నించి విఫలయ్యారు. అక్రమంగా వియాత్నాం సరిహద్దు దాటారు. కానీ 2022లో అక్కడి ప్రభుత్వం ఆయనను తిరిగి చైనాకు పంపేసింది. ఈసారి 11 నెలల జైలు శిక్ష అనుభవించారు.
ప్రస్తుతం డాంగ్ దక్షిణ కొరియా అధికారుల అదుపులో ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆయనను మళ్లీ చైనా పంపించవద్దని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు దక్షిణ కొరియా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ప్రస్తుతం కెనడాలో ఉన్న డాంగ్ కుమార్తె కేథరీన్ డాంగ్ తన తండ్రి కోసం ఎదురు చూస్తోంది. చైనాలో ఆయనకు అన్యాయం, వేధింపులు తప్ప మరేమీ దొరకవు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
