Bangladesh new govt: బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్ భారత్కు సందేశం పంపారా?
Nitai Roy Chowdhury: బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సారధ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.ఓ హిందువు కేబినెట్లో చోటు కల్పించారు.

Bangladesh Hindu leader Nitai Roy Chowdhury As Minister: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం, బిఎన్పి ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢాకాలోని జాతీయ పార్లమెంట్ దక్షిణ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సుమారు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన తారిఖ్ రెహమాన్, గత రెండు దశాబ్దాల తర్వాత తన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత ఏర్పడిన నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహించింది.
కొత్త ప్రభుత్వ కేబినెట్లో హిందూ మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు నితాయ్ రాయ్ చౌదరికి కీలక స్థానం లభించింది. ఆయన సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1949లో జన్మించిన నితాయ్ రాయ్ చౌదరి వృత్తిరీత్యా న్యాయవాది , బిఎన్పి వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్ ప్రభుత్వంలో విద్య, యువజన , క్రీడలు, న్యాయ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు బౌద్ధ మతానికి చెందిన దీపెన్ దివాన్ చక్మాను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా మైనారిటీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలనే సంకేతాన్ని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం ఇచ్చింది.
మొత్తం 50 మంది సభ్యులతో కూడిన ఈ భారీ మంత్రివర్గంలో 25 మంది క్యాబినెట్ మంత్రులు, 24 మంది రాష్ట్ర మంత్రులు , ముగ్గురు టెక్నోక్రాట్లు ఉన్నారు. మిర్జా ఫకృల్ ఇస్లాం ఆలంగీర్, అమీర్ ఖస్రూ మహ్మద్ చౌదరి వంటి సీనియర్ నేతలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంతో భారత్ సానుకూల సంబంధాలను కొనసాగించాలనుకుంటోందనడానికి ఇది ఒక నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Bangladesh gets a Hindu cabinet minister. Veteran BNP leader Nitai Roy Chowdhury (77) has been inducted into Tarique Rahman's cabinet. Likely to get the Ministry of Cultural Affairs pic.twitter.com/khFPgxSZyv
— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) February 17, 2026
ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో బిఎన్పి కూటమి 300 స్థానాలకు గాను 212 స్థానాల్లో విజయం సాధించి ఘనవిజయాన్ని నమోదు చేసింది. జమాత్-ఏ-ఇస్లామీ 68 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. ప్రజల ఐక్యత, ప్రజాస్వామ్య పునరుద్ధరణ , ఆర్థిక సంస్కరణలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని తారిఖ్ రెహమాన్ తన తొలి ప్రసంగంలో ప్రకటించారు.























