Flights Cancel: యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్కు వెళ్లే అన్ని విమానాలు రద్దు చేస్తున్న ఎయిర్ లైన్స్
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల సమయంలో పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో ఎయిర్ ఇండియా, ఇండిగో ఇతర ఎయిర్ లైన్స్ తమ విమానాలు రద్దు చేసింది.

న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ దేశంపై చేపట్టిన ఆపరేషన్తో మిడిల్ ఈస్ట్ దేశాల్లో గందరగోళం నెలకొంది. రెండు దేశాలు ఒకేసారి ఇరాన్ మీద డ్రోన్ దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో చాలా దేశాలు తమ ఎయిర్స్పేస్లను మూసివేశాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. వెస్ట్ ఆసియాలో అందుబాటులో ఉన్న ఎయిర్స్పేస్లో ప్రత్యామ్నాయ మార్గాలను వాడుకుని ఉత్తర అమెరికా, యూరప్లకు విమానాలను నడుపుతామని ఎయిర్ ఇండియా తెలిపింది.
ఎయిర్లైన్స్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం (మార్చి 2) నాడు యూరప్లోని అనేక నగరాలకు ఆరు విమానాలు రద్దు చేశారు. విమానయాన సంస్థ ఆదివారం సైతం 50 అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతర్లకు వెళ్లే అన్ని విమానాలు మార్చి 2 రాత్రి 11:59 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) నిలిపివేయనున్నట్లు వారు తెలిపారు.
ఈ రోజు ఏయే విమానాలు రద్దు
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఆదివారం నాడు ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది. అమృత్సర్- బర్మింగ్హామ్ (AI 117) , బర్మింగ్హామ్-ఢిల్లీ (AI 114)తో సహా 6 విమానాలు సోమవారం నాడు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీనితో పాటు ఢిల్లీ, జ్యూరిచ్ల మధ్య AI 151, AI 152 విమానాలు, అలాగే ఢిల్లీ నుంచి కోపెన్హాగెన్ల మధ్య AI 157, AI 158 విమానాలు కూడా సోమవారం నాడు రద్దు చేసింది.
పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నాం - ఎయిర్ ఇండియా
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. అనిశ్చితి, దాడులు కొనసాగుతున్న కారణంగా విమానాల నిర్వహణ సాధ్యం కాదని.. త్వరలో సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ప్రభావితమైన ప్రయాణికులకు వారి రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్లకు అవసరమైన సమాచారం పంపుతున్నట్లు పేర్కొంది. ఎయిర్లైన్ రీ-బుకింగ్, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లలో కూడా సహాయం చేస్తోంది. ప్రయాణికులు తమ విమానాల తాజా సమాచారం కోసం ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని లేదా 24×7 కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తామని, ఎప్పటికప్పుడు అవసరమైన అప్డేట్లను అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
మిడిల్ ఈస్ట్, దాని పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఇండిగో ఎయిర్లైన్స్ ఎక్స్ లో పోస్ట్ తెలిపింది. ఎయిర్ ఇండియా, ఇండిగో సహా పలు ఎయిర్ లైన్స్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న దేశాలు, వాటి మీదుగా వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నాయి. గగనతలం మూసివేత ఒక కారణం అయితే, ఎయిర్ స్ట్రైక్స్ మరో కారణమని విమానయాన సంస్థలు తెలిపాయి. ఈ సమయంలో చాలా మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలుసు, ప్రతి నిర్ణయం ఆలోచించి, సురక్షితంగా తీసుకుంటున్నామని మేం ప్రయాణికులకు హామీ ఇస్తున్నామని పేర్కొంది.
























