Viral Video: రైళ్లలో పిచ్చిపిచ్చిగా గంతులు వేయడం, అవి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇప్పుడో ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో ట్రైన్స్‌లో ఈ తరహా వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతూనే ఉన్నా...ఓవైపు ఇలాంటి అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ముంబయి లోకల్ ట్రైన్‌లోనూ ఇదే విధంగా ఓ యువతి అందరూ చూస్తుండగానే డ్యాన్స్‌లు చేసింది. భోజ్‌పురి పాటకు స్టెప్పులేసింది. సోషల్ మీడియాలో ఈ  వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. లేడీస్‌ కోచ్‌తో పాటు జనరల్‌ కోచ్‌లనూ డ్యాన్స్‌లు చేస్తూ వీడియో షూట్ చేసింది. ఆ యువతిపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది ముంబయి లోకల్ ట్రైన్‌ అకౌంట్‌ని ట్యాగ్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేశారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటి అశ్లీల నృత్యాలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా అసౌకర్యం కలిగించిందని మండి పడుతున్నారు. ఆ యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 




ఈ పోస్ట్‌లపై ముంబయి సెంట్రల్ రైల్వే స్పందించింది. సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. "మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. భద్రతా అధికారులకు సమాచారం అందించాం. కఠిన చర్యలు తీసుకుంటాం" అని వెల్లడించింది. నెటిజన్లు మాత్రం కామెంట్‌లతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఈ యువతి ఓసారి అరెస్ట్ అయిందని, పోలీసులు వార్నింగ్ ఇచ్చి పంపించారని ఓ నెటిజన్ చెప్పాడు. "ఆమెని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు కాబట్టే ఇలాంటివి చేస్తోంది" అంటూ మరో నెటిజన్ మండి పడ్డాడు.