తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పశ్చిమ దిశ‌ నుంచి తెలంగాణ వైపుగా వీస్తున్న శీతల గాలుల ప్రభావం కొనసాగుతోందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో నేడు రాష్ట్రంలో అక్కడక్కడ తేలి‌క‌పాటి వర్షాలు కురు‌స్తా‌యని, ఒకటి రెండు‌చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.


గురువారం (ఆగస్టు 5న) హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. ఆగస్టు 6న తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. అయితే, హెచ్చరికలు ఏమీ లేవని వివరించారు. చాలాచోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు.


తెలంగాణలో ఈ జిల్లాల్లోనే వర్షాలు కురిసే ఛాన్స్


హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 6న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.


Also Read: 


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..


ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 6న విశాఖపట్నంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా, గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలలో వాతావరణం వేడిగా ఉంటుందని, మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తిరుపతిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. విజయవాడలో కనిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. మరిన్ని వివరాలకు imd.gov.in వెబ్ సైట్‌ను కానీ, mausam.imd.gov.in వెబ్‌సైట్‌ను గానీ సందర్శించవచ్చు.


దేశంలో వర్షపాతం..


కేంద్ర వాతావరణ విభాగం గత నెల జులైలో దేశ వ్యాప్తంగా కురిసిన వర్షపాతానికి సంబంధించిన డేటాను ఇటీవల ప్రకటించింది. తెలంగాణలో కాస్త ఎక్కువ వానలు, ముంబయికి వరదలు సంభవించినా.. దేశవ్యాప్త సరాసరి సాధారణం కంటే 7 శాతం తక్కువగా వర్షాలు కురిసినట్లు విశ్లేషించింది. జులై ఫస్ట్ వీక్ లో కేరళ నుంచి రుతుపవనాలు వచ్చాయని, అవి చురుగ్గా కదిలినా చివరికి జులై నెలలో 7 శాతం లోటుతో వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.