Stalin accept defeat with dignity:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అభ్యర్థులకు ఓటు వేసిన కోట్లాది మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని అమూల్యమైనదిగా భావిస్తున్నానని, గెలుపోటములకు అతీతంగా ప్రజాపక్షాన నిలబడతామని ఆయన స్పష్టం చేశారు.

Continues below advertisement

 తేడా 3.52 శాతమే.. మాపై నమ్మకం చెక్కుచెదరలేదు!

ఎన్నికల గణాంకాలను వివరిస్తూ.. డీఎంకే కూటమికి ఈ ఎన్నికల్లో మొత్తం  1 కోటి 54 లక్షల 82 వేల 782 ఓట్లు  వచ్చాయని స్టాలిన్ పేర్కొన్నారు. విజయం సాధించిన పార్టీకి తమకంటే కేవలం  17.43 లక్షల ఓట్లు మాత్రమే అదనంగా వచ్చాయని, ఓట్ల శాతం పరంగా చూస్తే ఈ వ్యత్యాసం కేవలం  3.52 శాతం మాత్రమేనని ఆయన విశ్లేషించారు. ఈ గణంకాలు ప్రజలకు తమపై ఉన్న బలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Continues below advertisement

ప్రజల వద్దకే వెళ్లి కృతజ్ఞతలు చెప్పండి - అభ్యర్థులకు ఆదేశం 

ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతమని నమ్మే డీఎంకే, ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని స్టాలిన్ అన్నారు.  మనం ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నామో, ఆ ప్రజలకు ధన్యవాదాలు చెప్పడం మన బాధ్యత  అని పేర్కొంటూ, విజయం సాధించిన అభ్యర్థులందరూ వెంటనే తమ నియోజకవర్గాల్లో పర్యటించి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు తెలపాలని ఆయన ఆదేశించారు.

సిద్ధాంతం ముఖ్యం.. కార్యకర్తలే ప్రాణం! 

డీఎంకే ఇప్పటివరకు ఆరుసార్లు అధికారంలో ఉందని, ఎన్నో విజయాలను, అపజయాలను చూసిందని స్టాలిన్ గుర్తు చేశారు.  రాజకీయ ప్రయాణంలో గెలుపోటములు సహజం, కానీ మన సిద్ధాంతం ఓడిపోకూడదు. విజయ గర్వం లేకుండా, అపజయానికి కుంగిపోకుండా ఆశయ సాధన కోసం నడిచేవారే నిజమైన కార్యకర్తలు  అని ఆయన కొనియాడారు. పార్టీ శ్రేణులు పంపిన ఓదార్పు సందేశాలపై స్పందిస్తూ.. మీరు నా వెంట ఉన్నంత కాలం నాకు చింత లేదు.. మీరు ఈ ఉద్యమానికి జీవనాడి వంటివారు  అని భావోద్వేగానికి లోనయ్యారు.    

 బలమైన ప్రతిపక్షంగా ప్రజా పోరాటం 

భవిష్యత్ కార్యాచరణపై స్పందిస్తూ.. అధికారంలో ఉంటే పథకాల ద్వారా, ప్రతిపక్షంలో ఉంటే పోరాటాల ద్వారా ప్రజలకు సేవ చేస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఇప్పుడు ఒక బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగుపెట్టి, ప్రజల డిమాండ్ల కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధిల అడుగుజాడల్లో నడుస్తూ.. ద్రవిడ ఉద్యమ ఆశయాలను, తమిళ భాషను, జాతిని కాపాడుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. మనం మళ్ళీ గెలుస్తాం!  అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.