Watch Video: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరూ చెప్పలేరు. ఎంతో ఆరోగ్యంగా ఉండే మనుషులు కూడా ఒకేసారి కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా చూశాం. తాజాగా ఓ వ్యక్తి ఆసుపత్రిలో పేపర్‌ చదువుతూ ఉన్నట్టుండి కుప్పకూలి గుండెపోటుతో మరణించాడు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇదీ జరిగింది


రాజస్థాన్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. బార్మర్‌కు చెందిన వ్యాపారవేత్త దిలీప్ కుమార్ మదానీ.. పంటి నొప్పి కారణంగా శనివారం స్థానికంగా ఉన్న ఒక పళ్ల డాక్టర్‌ వద్దకు వెళ్లారు. ఆ క్లినిక్‌ రిసెప్షన్‌ వద్ద కూర్చొని అక్కడున్న వార్తా పత్రిక చదువుతున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఒక పక్కకు ఒరిగిన ఆయన కిందపడ్డారు.




ఇది గమనించిన ఆ క్లినిక్‌ సిబ్బంది వెంటనే దిలీప్‌ కుమార్‌కు సహాయం చేసేందుకు పరుగున వచ్చారు. ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ వ్యాపారవేత్త అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ పంటి ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.