Viral Video: 


ముంబయి లోకల్ ట్రైన్‌లో గొడవ..


రైల్‌లో సీట్‌ కోసం ఓ ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ముంబయి లోకల్ ట్రైన్‌లో జరిగిందీ ఘటన. సీట్ విషయంలో చిన్నగా మొదలైన గొడవ ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకునేంత వరకూ వచ్చింది. అక్కడే ఓ మహిళా పోలీసు ఉన్నారు. వీళ్లిద్దరినీ ఆపేందుకు చాలానే ప్రయత్నించారు. అయినా...వాళ్లు ఆమె మాట వినలేదు. పైగా ఈ గొడవలో ఆ పోలీస్‌కి కూడా గాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో
చికిత్స పొందుతున్నారు. "ఓ సీట్ విషయంలో తలెత్తిన వివాదంతో మహిళలు కొట్టుకున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్‌కి గాయాలయ్యాయి" అని ANI న్యూస్ వెల్లడించింది. తుర్బే స్టేషన్ వద్ద ఈ గొడవ మొదలైనట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురు మహిళల మధ్య గొడవ మొదలు కాగా...పక్కనే ఇంకొందరూ ఇందులో జోక్యం చేసుకున్నారు. అందుకే ఉన్నట్టుండి ఈ గొడవ పెద్దదైందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ మహిళా పోలీస్‌తో పాటు ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఇద్దరి చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. తుర్బే స్టేషన్ వద్ద ఓ మహిళ దిగిపోతూ పక్కనే ఉన్న మరో మహిళకు సీట్ ఇచ్చింది. అయితే..ఆమె పక్కనే ఉన్న మరో మహిళ..ఆ సీట్‌లో కూర్చునేందుకు ప్రయత్నించింది. ఫలితంగా...ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. సీట్ నాదంటే నాదని గొడవ పడ్డారు. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారి పెద్ద యుద్ధానికే దారి తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.