Violence Erupts in Ujjain: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా తరానాలో చోటుచేసుకున్న ఒక చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి హింసకు దారితీసింది. దారి ఇచ్చే విషయంలో సోహన్ ఠాకూర్ అనే వ్యక్తికి, మరో వర్గానికి చెందిన కొందరికి మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణగా మారింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కొందరు వ్యక్తులు సోహన్ ఠాకూర్ అనే యువకుడిపై రాడ్లతో ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహించిన మరో వర్గం వారు రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘర్షణ కారణంగా ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. తరానా బస్టాండ్ సమీపంలో ఉన్న బస్సులను ధ్వంసం చేయడమే కాకుండా, వాహనాలకు నిప్పుపెట్టారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన సోహన్ ఠాకూర్ తాను బజరంగ్ దళ్ సభ్యుడినని, లవ్ జిహాద్ వంటి అంశాలపై తాను పని చేస్తున్నందుకే పక్కా ప్రణాళికతో తనపై దాడి చేశారని ఆరోపించారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ నేతృత్వంలో సుమారు 100 మందికి పైగా పోలీసు బలగాలను తరానాలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ పుకార్లను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడినట్లుగా గుర్తించిన రిజ్వాన్, సల్మాన్, నావేద్ సహా పలువురు నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు.
విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. దోషులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. శాంతి భద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను కూడా సిద్ధంగా ఉంచారు.