Vijayan counter letter to Revanth: కేరళ ఎన్నికల ప్రచార బరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాసిన సుదీర్ఘ లేఖ ఇప్పుడు కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేరళ గడ్డపై కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కేరళ సీఎం పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర విమర్శలు, దానికి విజయన్ గణాంకాలతో ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
విజయన్పై రేవంత్ రెడ్డి విమర్శలు
కేరళలో యుడిఎఫ్ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, పినరయి విజయన్పై తీవ్ర విమర్శలు చేశారు. పినరయి విజయన్ కేరళకు మరో నరేంద్ర మోదీలా మారారని, ఆయన నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. విజయన్ రాజకీయ జీవితం ముగిసిందని, ఆయన పాలనకు ఎక్స్పైరీ డేట్ దగ్గరపడిందని రేవంత్ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా విపక్ష నాయకులపై ఈడీ, సిబిఐ దాడులు జరుగుతుంటే, విజయన్ పైన మాత్రం ఎందుకు విచారణలు జరగడం లేదని ప్రశ్నించారు. మోదీనే విజయన్ను కాపాడుతున్నారని ఆరోపించారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం విచారణలను ఎదుర్కొంటుంటే, ఎటువంటి త్యాగాలు లేని విజయన్ కేంద్రంతో కుమ్మక్కై తప్పించుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు.
పినరయి విజయన్ ఐదు పేజీల కౌంటర్
రేవంత్ ఆరోపణలను తిప్పికొడుతూ విజయన్ అత్యంత ఘాటుగా లేఖ రాశారు. తోటి ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలు చేయడం, ఎక్స్పైరీ డేట్ వంటి పదజాలం వాడటం రాజకీయాల్లో సంస్కారం కాదని విజయన్ హితవు పలికారు. తాము బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని, ఆర్టికల్ 131 కింద కేంద్రంపై న్యాయ పోరాటం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు. బీజేపీకి తాము ఎప్పుడూ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. కేరళ సాధించిన అభివృద్ధిపై రేవంత్ చేసిన విమర్శలను తోసిపుచ్చుతూ.. నీతి ఆయోగ్ స్థిరమైన అభివృద్ధి సూచీలో కేరళ 79 పాయింట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే, రేవంత్ పాలిస్తున్న తెలంగాణ 6వ స్థానంలో ఉందని ఎత్తి చూపారు. దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అని, తమ ప్రభుత్వ పనితీరుకు ప్రజల మద్దతు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
యూడీఎఫ్కు రేవంత్ మాటలు బలం ఇస్తాయా? రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేరళలోని మైనారిటీ ఓటర్లను ఆకర్షించడానికి , ఎల్డిఎఫ్-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని నిరూపించడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని కేరళ రకాజకీయవర్గాలంటున్నాయి. అయితే, పినరయి విజయన్ తన లేఖలో కేవలం రాజకీయ విమర్శలే కాకుండా, అభివృద్ధి సూచీలను అస్త్రాలుగా చేసుకుని కౌంటర్ ఇచ్చారు. తొమ్మిదో తేదీన కేరళలో పోలింగ్ పూర్తి కానుంది.
