POCSO Case Varanasi Teacher: అక్షరాలు దిద్దించి క్రమశిక్షణ నేర్పించాల్సిన గురువే కిరాతకురాలిగా మారింది. చిన్నారులకు రక్షణగా నిలవాల్సిన బడిలోనే ఐదేళ్ల పసివాడిపై రాక్షసత్వం ప్రదర్శితమైంది. ప్యాంట్‌లో మూత్రం పోసుకున్నాడనే పసివాడి తప్పుకు.. వేడి కత్తితో ప్రైవేట్ పార్ట్‌ను కాల్చి భయానక క్షోభకు గురిచేసింది ఒక మహిళా ఉపాధ్యాయురాలు. ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం వారణాసిలోని భేలూపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెరీన్ సోనీ ప్లే స్కూల్ లో చోటుచేసుకున్న ఈ దారుణ  ఘటన  కలకలం రేపుతోంది. 

Continues below advertisement

జులై 4న పాఠశాలలో తరగతి జరుగుతున్న సమయంలో ఐదేళ్ల చిన్నారి వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు ఉపాధ్యాయురాలిని అనుమతి కోరాడు. అయితే సదరు ఉపాధ్యాయురాలు బాలుడి విన్నపాన్ని  నిరాకరించింది. పసివాడు కావడంతో ఎంతసేపు ఆపుకోవాలో తెలియక, మూత్రాన్ని నియంత్రించుకోలేక చివరకు ప్యాంట్‌లోనే పోసుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ టీచర్, బాలుడిని పక్కనే ఉన్న మరో గదిలోకి తీసుకెళ్లి, తీవ్రంగా కొట్టడమే కాకుండా వేడి చేసిన కత్తితో ప్రైవేట్ పార్ట్‌పై కాల్చింది. ఈ ఘోరాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆ పసివాడిని భయభ్రాంతులకు గురిచేసింది.

సాయంత్రం ఇంటికి వచ్చిన చిన్నారి తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతుండటం, భయంతో వణికిపోతుండటం గమనించిన తల్లిదండ్రులు ఒంటిపై ఉన్న గాయాలను చూసి షాక్‌కు గురయ్యారు. ఏం జరిగిందో అని ప్రేమగా అడిగి తెలుసుకున్నారు.  పాఠశాలలో టీచర్ చేసిన దారుణాన్ని ఆ పసివాడు ఏడుస్తూ వివరించాడు. వెంటనే కంగారుపడిన తల్లిదండ్రులు మరుసటి రోజు ఉదయాన్నే స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్  ను కలవగా.. బాధ్యతగల పాఠశాల యాజమాన్యంగా స్పందించాల్సింది పోయి, సమస్యను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులపైనే తిరిగి బెదిరింపులకు పాల్పడటంతో యాజమాన్య తీరుపై బాధితులు తీవ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Continues below advertisement

పాఠశాల యాజమాన్యం నుంచి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో, తీవ్ర గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు.. అనంతరం భేలూపూర్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చిన్నారి శరీర భాగాలపై ఉన్న తీవ్రమైన సురక్షిత లేని గాయాలను, మెడికల్ రిపోర్టులను పరిశీలించిన పోలీసులు తక్షణమే స్పందించారు. సదరు ఉపాధ్యాయురాలితో పాటు, ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి బెదిరింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ హేమలతపై భారతీయ నశిత్ సంహిత,  పోక్సో   చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.

చిన్నారులను చేర్పించే ప్లే స్కూళ్లలో ఇలాంటి సైకో మనస్తత్వాలు ఉన్న ఉపాధ్యాయులు ఉండటంపై తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పసివాడిపై ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన సదరు టీచర్‌ను , నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించి, స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని   డిమాండ్ చేస్తున్నాయి.