Uttarkashi Dharali village swept away: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరలీ గ్రామంలో జరిగిన భారీ క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు వచ్చాయి. మట్టిపెళ్లలు విరిగిపడి ధారాలి అనే గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, హోమ్స్టేలను తుడిచి పెట్టేశాయి. ఈ ఘటన ఖీర్ గంగా నది క్యాచ్మెంట్ ప్రాంతంలో సంభవించింది, దీనివల్ల గ్రామంలో తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది.
ఆగస్టు 5 మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో ఉత్తరకాశీ జిల్లాలోని హర్సిల్ సమీపంలోని ధరలీ గ్రామంలో, ఖీర్ గంగా నది క్యాచ్మెంట్ ప్రాంతంలో ఈ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ధరలీ గ్రామం గంగోత్రీకి సమీపంలోని ఒక ముఖ్యమైన స్టాప్ఓవర్ గ్రామం, ఇక్కడ అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మరియు హోమ్స్టేలు ఉన్నాయి. ఈ ఘటన వల్ల భారీ వరదలు , మట్టిపెళ్లలు విరిగిపడటం వల్ల గ్రామంలోని ఇళ్లు, దుకాణాలు , రోడ్లు పూర్తిగా నాశనమయ్యాయి. 20-25 హోటళ్లు మరియు హోమ్స్టేలు వరదల్లో కొట్టుకుపోయాయని చెబుతున్నారు. అందులో పర్యాటకులు ఎంత మంది ఉన్నారు అన్నదానిపై ఇంకా సమాచారం లేదు. వంద మంది వరకూ ఉండవచ్చని అంటున్నారు. గ్రామంలోని అనేక ఇళ్లు, దుకాణాలు, మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
భారత సైన్యం సూర్య కమాండ్ స్థానికులు రికార్డ్ చేసిన వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. భారత సైన్యం ఐబెక్స్ బ్రిగేడ్, హర్సిల్లోని సైనిక శిబిరం నుంచి వెంటనే బయలుదేరి, ధరలీ గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించింది.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) నుంచి 16 మంది సభ్యుల బృందం , 12వ బెటాలియన్ నుంచి మరో బృందం రెస్క్యూ కార్యకలాపాల కోసం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) నుంచి మూడు బృందాలు, యు రెండు అదనపు బృందాలు షాస్త్రధర్ ఎయిర్స్ట్రిప్ వద్ద సిద్ధంగా ఉన్నాయి.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ ఘటనను "అత్యంత బాధాకరం" అని స్పందించారు. రెస్క్యూ కార్యకలాపాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నట్లు Xలో పోస్ట్ చేశారు. ఆయన సీనియర్ అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం ధామీతో ఫోన్లో మాట్లాడారు.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఉత్తరాఖండ్లో ఆగస్టు 10 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది