Kadapa district News: కడప జిల్లా బద్వేల్ పట్టణంలో విద్యార్థిని అదృశ్యం అయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కూతురుకు ఏమైందో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల కారణంగా.. తమ కూతురుకు జరగరానిది ఏమైనా జరిగిందోమోనని భయపడిపోతున్నారు. ఎలాగైనా సరే తమ కూతురు జాడ కనుక్కొని వెంటనే తమ చెంతకు చేర్చాలని పోలీసులను బతిమాలుతున్నారు. 


అసలేం జరిగిందంటే..?


బద్వేల్ పట్టణంలోని గోపిరెడ్డి స్కూర్ లో ఏడో తరగతి చదువుతున్న వెంకట సంజన.. రోజూలాగే శుక్రవారం ఉదయం బడికి వెళ్లింది. స్కూలు అయిపోయాక బడి నుంచి బయటకు వచ్చిన సంజన.. ఇంటికి కూడా వెళ్లలేదు. అయితే సాయంత్రం గడుస్తున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడ్డ తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులకు ఫోన్ చేశారు. అయితే సంజన బడి అయిపోగానే బయటకు వెళ్లిందని చెప్పడంతో తల్లిదండ్రుల్లో మరింత టెన్షన్ మొదలైంది. ఆమె స్నేహితులు, బంధువులు, తెలిసన వాళ్లందరికీ ఫోన్ లు చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాలన్నీ గాలించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో.. ఇక లాభం లేదనుకొని పోలీసులను ఆశ్రయించారు. 


కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సంజన కనిపించకుండా మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. అయితే తమ కూతురుకు ఏం జరిగిందోనని తల్లిదండ్రులు చాలా భయపడిపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. ఎలాగైనా సరే తమ కూతురును తమ చెంతకు చేర్చమంటూ పోలీసులను వేడుకుంటున్నారు. 


కృష్ణా జిల్లాలో ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం..


రెండు నెలల క్రితం కృష్ణా జిల్లాలో కలకలం రేపిన విద్యార్థినుల అదృశ్యం కేసులో పోలీసులకు లీడ్ దొరికింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజక వర్గం కంకిపాడు జడ్పీ హైస్కూల్‌లో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినుల జాడను పోలీసులు కనిపెట్టారు. వీరిద్దరూ ప్రస్తుతం చెన్నైలో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులు అదృశ్యమైనట్టు వార్త వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. చివరకు ఈ విద్యార్థులు సినిమా పిచ్చితోనే ఇంటి నుంచి పారిపోయినట్లు తేల్చారు. అయితే ఈ అమ్మాయిలు సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. తమ పిల్లలు మిస్సైనట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ పిల్లలకు ఏమైందోనంటూ ఏడుస్తూనే ఉన్నారు. 


గుండి జోజి అనే వ్యక్తే అమ్మాయిలిద్దరినీ తీసుకెళ్లాడు..


ఎలాగైనా సరే తమ పిల్లలను వెతికి సరక్షితంగా తమకు అప్పగించాలంటూ పోలీసులను వేడుకున్నారు. ఈ క్రమంలోనే  ముందు నుంచి పోలీసులు అనుమానించినట్లుగా అదే గ్రామానికి చెందిన గుండి జోజి అనే వ్యక్తే వీరిని తీసుకెళ్లినట్లు తేలింది. అయితే ఆ అమ్మాయిల ఇద్దరికీ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లినట్లు పోలీసులు గుుర్తించారు. మిస్సైన విద్యార్థుల్లోని ఒక విద్యార్థిని ఇంటి పక్కనే జోజి నివసిస్తున్నాడు. జోజితో పాటు ఇద్దరు విద్యార్థులు చెన్నైలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.


జోజితో పాటు విద్యార్థినులను ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు..


పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే తమ పిల్లలను గ్రామానికి తీసుకు రావాల్సిందిగా కోరారు. తమ పిల్లలకు మాయ మాటలు చెప్పి చెన్నై తీసుకెళ్లిన జోజిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేవలం అదృశ్యం అయిన అమ్మాయిల తల్లిదండ్రులే కాకుండా గ్రామస్థులంతా కూడా జోజిపై చాలా కోపంగా ఉన్నారు. అతడు గ్రామంలోకి మళ్లీ వచ్చినా అక్కడ ఉండనిచ్చేది లేదని చెప్తున్నారు. ఇలా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్తూ.. భవిష్యత్తులో ఇంకెంత మందిని తీసుకెళ్తాడోనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోజిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. విద్యార్థులతో పాటు జోజిని కంకిపాడు తీసుకొచ్చేందుకు పోలీసులు కూడా విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.