Warrant Against Jaya Prada:


ఎన్నికల కోడ్ ఉల్లంఘన..


సినీనటి, మాజీ ఎంపీ జయప్రదకు యూపీలోని రామ్‌పూర్ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లోక్‌సభ ఎన్నికల్లో కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారు జయప్రద. ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగా..ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. "జయప్రద వచ్చే ఏడాది జనవరి 9న తదుపరి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కేసు విచారణకు ఆమెను ఎన్ని సార్లు పిలిచినా హాజరు కాలేదు. అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు" అని ప్రభుత్వం తరపున న్యాయవాది అమర్‌నాథ్ తివారి వెల్లడించారు. యూపీలోని రెండు చోట్ల ఆమె ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. రెండు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. రాంపూర్ కోర్ట్ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే చాలా సార్లు ఆమెకు నోటీసులు పంపింది. ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఫలితంగా...కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాన్‌ బెయిలబుల్ వారెంట్‌తో షాక్ ఇచ్చింది. 2019 ముందు వరకూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఉన్న జయప్రద...అప్పటి సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీలో చేరి పోటీ చేశారు. సమాజ్‌వాదీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 


తెలుగు రాష్ట్రాలపై వ్యాఖ్యలు


ఉత్తరాది రాజకీయాల్లో రాణిస్తున్న జయప్రద ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఆమె తెలుగు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాజకీయాల్లో రావాలని తనకు ఆసక్తిగా ఉందని జయప్రద అన్నారు. ఇక్కడి ప్రజలకు సేవ చేసుకొనే అవకాశం కోసం చూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నట్లుగా చెప్పారు. తమ పార్టీ పెద్దలు నిర్ణయించి ఆంధ్ర రాష్ట్రంలోగానీ, తెలంగాణలో గానీ పోటీ చేయమని చెప్తే తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తెలుగు బిడ్డగా వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం సరి కాదని జయప్రద అభిప్రాయపడ్డారు. మరింత సంపూర్ణమైన పాలన అందించి, ఇక్కడి ప్రజలకే అందుబాటులో ఉండాలని అన్నారు. అప్పుడే ప్రజలు టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను అభినందిస్తారని అన్నారు.  


300 పైగా సినిమాలు


జయప్రద పుట్టిన స్థలం రాజమండ్రి. ఆమె తల్లి నీలవేణి ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో చనిపోయారు. అప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు హుటాహుటిన వచ్చిన ఆమెకు పలువురు సినీ ప్రముఖులు సహా రాజకీయ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. 
అందంతో పాటు అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమనే కాకుండా భారతీయ చిత్ర సీమలో తన నటనతో చెరగని ముద్ర వేశారు జయప్రద. భూమి కోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించి మెప్పించారు. 
నటిగా జయప్రద 300 పైగా సినిమాల్లో నటించారు. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా జయప్రద రాణించారు.


Also Read: బీజేపీపై కేసీఆర్ దండయాత్ర-రెండోసారి హస్తినబాట