TSRTC: కొత్త కొత్త ఆలోచనలు, కార్యక్రమాలతో ప్రయాణికులు విశేషంగా ఆకట్టుకుంటోంది టీఎస్ఆర్టీసీ. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించేందుకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొత్త ఆలోచనలు చేస్తూ వాటికి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా మరోసారి ప్రయాణికులను ఆకర్షించే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి చిన్న వాటర్ బాటిల్ ఇచ్చేవారు. ఇక నుండి వాటర్ బాటిల్ తో పాటు స్నాక్స్ బాక్స్ కూడా ఇవ్వనున్నారు. 


నామమాత్రపు ధరతో స్నాక్స్ బాక్స్


సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్‌ టికెట్‌ తో పాటే 'స్నాక్‌ బాక్స్‌'ను ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్‌ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్‌ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్‌ e-గరుడ బస్సుల్లో స్నాక్‌ బాక్స్‌ విధానాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తోంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది. ఈ స్నాక్‌ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్‌ ప్రెషనర్‌, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్‌ బాక్స్‌ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.


"ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో టీఎస్‌ఆర్టీసీ ముందుకు వెళుతోంది. అందులో భాగంగా స్నాక్‌ బాక్స్‌ ప్రయాణికులకు ఇవ్వాలని నిర్ణయించింది. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని బలపరిచే చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు ప్రయాణంలో ఉపయోగపడే మౌత్‌ ప్రెషనర్‌, టిష్యూ పేపర్‌ తో కూడిన స్నాక్‌ బాక్స్‌ను ప్రయాణికులకు సంస్థ అందించనుంది. టీఎస్‌ఆర్టీసీ ఏ కార్యక్రమం తీసుకువచ్చినా ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారు. సంస్థను ప్రోత్సహిస్తున్నారు. ఈ స్నాక్ బాక్స్‌ విధానాన్ని అలాగే అదరించాలి" అని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ కోరారు.


క్యూఆర్ కోడ్‌తో ఫీడ్ బ్యాక్ స్వీకరణ


ప్రతి స్నాక్‌ బాక్స్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, దానిని ఫోన్లలో స్కాన్‌ చేసి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫీడ్‌ బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని స్నాక్‌ బాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల ఫీడ్‌ బ్యాక్‌ను బట్టే మిగతా సర్వీసులకు స్నాక్ బాక్స్ విధానాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు.






సాధారణ ప్రయాణికులకు రూట్ పాస్


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలి సారిగా ‘జనరల్ రూట్ పాస్’కు తెలంగాణ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ రూట్ పాస్ ను ఈ నెల 27వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు వస్తుంది. నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ కు రూ.600గా, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 గా ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.