Telugu states leaders meet in Davos:  దావోస్ సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్  మంత్రి నారా లోకేష్ , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ  అయ్యారు.  సదస్సు ప్రాంగణంలో వీరిద్దరూ కలిసినప్పుడు ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, లోకేష్‌ను శాలువాతో సత్కరించారు. వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మేడారం జాతరకు నారా లోకేష్‌ను రేవంత్ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.     

ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,  తెలంగాణ ఐటీ మంత్రి  శ్రీధర్ బాబు మధ్య కూడా దావోస్ వేదికగా కీలక చర్చలు జరిగాయి. రాష్ట్ర విభజన అనంతరం అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారంతో పాటు, రెండు రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో పరస్పర సహకారంపై వీరు ముచ్చటించినట్లు సమాచారం. గ్లోబల్ ఇన్వెస్టర్ల ముందు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి బలాన్ని చాటిచెప్పేలా వీరి భేటీ సాగింది.  

ఈ సదస్సులో రెండు రాష్ట్రాలు పోటాపోటీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి  తెలంగాణ రైజింగ్ 2047  విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించగా, చంద్రబాబు నాయుడు ఏపీలో ఉన్న  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్,  కొత్త పారిశ్రామిక విధానాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఏఐ   , లైఫ్ సైన్సెస్,  మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడుల కోసం ఇద్దరు నేతలు గ్లోబల్ సీఈఓలతో విడివిడిగా మరియు కొన్ని చోట్ల ఉమ్మడి వేదికలపై చర్చిస్తున్నారు.                                             తెలంగాణ పెవిలియన్ వద్ద జరిగిన  జాయిన్ ది రైజ్  కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్  చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశారు. అటు ఏపీ పెవిలియన్‌లో మంత్రి లోకేష్, స్విస్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యి నైపుణ్యాభివృద్ధి ,  డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోరారు.