Telangana CM Revanth Reddy will meet with Jharkhand MLAs : హైదరాబాద్ చేరుకున్న ఝార్ఖండ్  ‌ ఎమ్మెల్యేలతో  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  సమావేశం కానున్నారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని ఈడీ అరెస్టు చేయడంతో అక్కడ ప్రభుత్వం మారింది. కొత్త సీఎం ప్రమాణం చేశారు. బలపరీక్ష నిర్వహించుకునేందుకు సమయం ఉండటంతో బీజేపీ ట్రాప్ లో పడకుండా  36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. వీరందర్నీ షామీర్ పేటలోని ఓ రిసార్టులో ఉంటారు.  ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు ఒక టేకర్‌ను తెలంగాణ కాంగ్రెస్ నియమించింది.  ఫిబ్రవరి 5 ఉదయం 7 గంటల వరకు లియోనియా రిసార్ట్‌లోనే ఉండనున్న ఎమ్మెల్యేలు..  ఫిబ్రవరి ఐదో తేదీన స్పెషల్‌ ఫ్లైట్‌లో రాంచీ వెళ్లనున్నారు.                   

  
ప్రభుత్వ ఏర్పాటుకు పిలవని గవర్నర్ పై విమర్శలు రావడంతో ఆలస్యంగా స్పందించారు. ఎట్టకేలకు ఝార్ఖండ్‌ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంపయీ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. పది రోజుల్లో బలం నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం నేతృత్వంలోని కూటమి చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ లో క్యాంపునకు తరలించింది.                               


మెజార్టీని నిరూపణ కోసం జేఎంఎం సారథ్యంలోని కూటమి ఫిబ్రవరి 5న బలపరీక్షకు సిద్ధమవుతోంది.  రోజులపాటు అసెంబ్లీ సెషన్‌ జరుగుతుంది. తొలి రోజు బలపరీక్ష నిర్వహణ ఉంటుంది.  మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టుతో ఝార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఎంగా చంపయీ సోరెన్‌ను కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటైంది.                            


చంపయీ సోరెన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు గురువారం అర్ధరాత్రి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అలంగిర్‌ ఆలం, ఆర్జేడీ నాయకుడు సత్యానంద్‌ భోక్తా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజుల్లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ కోరారు.ఝార్ఖండ్‌లో అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజార్టీ నిరూపించుకునేందుకు 41 మంది సభ్యుల మద్దతు కావాలి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేల రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.