Singam Annamalai IPS: తమిళనాడు రాజకీయాల్లో సంచలన నేతగా ఎదిగిన మాజీ ఐపీఎస్ అధికారి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చ నడుస్తోంది. ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసి, కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తోంది. దీంతో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడు వ్యాప్తంగా లక్షలాది మందికి  అన్నామలై గా సుపరిచితుడైన ఈ నేత అసలు పేరు అది కాదనే విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Continues below advertisement

ఆయన అసలు పేరు శివ సెంథిల్ కుమార్ . కరూర్ జిల్లాలో జన్మించిన ఆయన, పాఠశాల రోజుల్లోనే తన పేరును మార్చుకున్నట్లు సమాచారం. 10వ తరగతి చదువుతున్న సమయంలో  శివ సెంథిల్ కుమార్ అనే పేరు చాలా పొడవుగా ఉండటంతో, కాస్త చిన్నదిగా, అందరికీ సులువుగా గుర్తిండిపోయేలా ఉండేందుకు ఆయన  అన్నామలై గా తన పేరును మార్చుకున్నారు. శివభక్తుడైన ఆయన.. పరమశివునితో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం కారణంగానే  అన్నామలై  అనే పేరును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేరు మార్పే తర్వాతి కాలంలో ఆయనకు ఒక బలమైన పర్సనల్ బ్రాండ్‌గా ఉపయోగపడింది.

విద్యాభ్యాసం విషయానికి వస్తే, అన్నామలై పీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆపై ప్రతిష్టాత్మక ఐఐఎం లక్నో నుండి ఎంబీఏ పట్టా పొందారు. ఆ తర్వాత యూపీఎస్‌సీ  పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, 2011 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిగా సేవలందించారు. కర్ణాటకలో పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో ఆయన చూపించిన దూకుడు, నిక్కచ్చిగా వ్యవహరించే శైలి కారణంగా ప్రజలు ఆయనను  సింగం  సినిమాలోని దొరైసింగం పాత్రతో పోల్చేవారు. అలా ఆయనకు  సింగం అన్నామలై అనే ముద్దుపేరు వచ్చింది.

Continues below advertisement

2019లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, ద్రావిడ రాజకీయాలు రాజ్యమేలే ఆ రాష్ట్రంలో బీజేపీకి ఒక ప్రత్యేక గుర్తింపును, విజిబిలిటీని తీసుకువచ్చారు. అయితే, పార్టీ అధిష్టానంతో వచ్చిన కొన్ని అంతర్గత విభేదాల కారణంగా ఆయన ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పారు.  

ప్రస్తుతం, సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అన్నామలై, నాడు  శివ సెంథిల్ కుమార్  నుండి అన్నామలై గా మారినట్లే.. ఇప్పుడు సరికొత్త రాజకీయ రూపంలో తనను తాను రీ-ఇన్వెంట్   చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ద్రావిడ కోటలో ఈ మాజీ ఐపీఎస్ అధికారి వేస్తున్న కొత్త అడుగులు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.