Stray Dogs Supreme Court Judgment : వీధి కుక్కల స్వైరవిహారం, కుక్క కాట్ల మరణాలపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన, సంచలన తీర్పును వెలువరించింది. ఈ సమస్యపై దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం  మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వాలకు, మున్సిపల్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.  దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు నిత్యకృత్యంగా మారి, పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రజలు, ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు,  విదేశీ పర్యాటకులు కుక్క కాట్లకు గురవుతుంటే.. ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించరాదు  అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గౌరవప్రదంగా, భయం లేకుండా బతికే హక్కు ప్రతి పౌరుడికి ఉందని గుర్తు చేస్తూ.. వీధి కుక్కల నియంత్రణలో విఫలమైన రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Continues below advertisement

 ప్రమాదకరమైన కుక్కలకు  కారుణ్య మరణం 

ఈ తీర్పులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. పిచ్చి పట్టిన  , నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న లేదా అత్యంత ప్రమాదకరంగా మారి మనుషులపై దాడులు చేస్తున్న  కుక్కలను చంపేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం, పశువైద్యుల పర్యవేక్షణలో అటువంటి కుక్కలకు కారుణ్యమరణం ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నప్పుడు దయ చూపడం కంటే రక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది.

Continues below advertisement

 ప్రజా ప్రాంగణాల్లో కుక్కలు ఉండకూడదు 

గత నవంబర్ 7, 2025 ఇచ్చిన తీర్పును సవరించాలని జంతు ప్రేమికులు కోరిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. ఆసుపత్రులు, పాఠశాలలు, విద్యాసంస్థలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, బస్ స్టాండ్లు,  రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో వీధి కుక్కలు ఉండటానికి వీల్లేదని ఖరాకండిగా చెప్పింది. ఒకవేళ వీధి కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్  చేసినా.. వాటిని తిరిగి అవే రద్దీ ప్రాంతాల్లో వదిలిపెట్టకూడదని, వాటి కోసం ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.  

  అధికారులకు కోర్టు ధిక్కరణ భయం 

ఈ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే మున్సిపల్ అధికారులు  రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై కోర్టు ధిక్కరణ (Contempt of Court) చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. ప్రతి జిల్లాలో కనీసం ఒక  యానిమల్ బర్త్ కంట్రోల్  కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, తగినన్ని యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. హైకోర్టులు ఈ తీర్పు అమలును పర్యవేక్షించాలని సూచించింది.

 చట్టబద్ధమైన రక్షణ 

కోర్టు ఆదేశాలను అమలు చేసే క్రమంలో నిజాయితీగా పనిచేసే అధికారులపై తక్షణమే కేసులు   నమోదు చేయవద్దని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఒకవేళ ఎవరైనా దురుద్దేశంతో తప్పుడు చర్యలకు పాల్పడితే తప్ప, సామాన్య పౌరుల భద్రత కోసం పనిచేసే అధికారులకు రక్షణ ఉంటుందని పేర్కొంది.