Singareni Election News: సింగరేణి ఎన్నికలు ముగిశాయి. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. ప్రచార పర్వం సోమవారం (డిసెంబరు 27) సాయంత్రంతోనే ముగిసింది. నేడు జరిగిన ఎన్నికల కోసం 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా శ్రీరాంపూర్‌ ఏరియాలో 15 కేంద్రాలు ఉండగా ఇల్లెందులో చాలా తక్కువగా మూడు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్ర 5 గంటలకు ముగిసింది. 


ముగిసిన వెంటనే ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. ఏరియాల వారీగా విజేతలను ప్రకటించి.. ఆ తర్వాత మొత్తం పోలైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు పొందిన సంఘానికి గుర్తింపు హోదా కేటాయిస్తారు. 


తెలంగాణ ఉద్యమం 2009లో పీక్స్ లో ఉన్న సమయంలో సింగరేణిలో బీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం అయిన.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్‌) బాగా బలపడింది. అదే వరుసగా 2012, 2017 ఎన్నికల్లో గెలిచింది. 2017లో ఏకంగా టీజీబీకేఎస్‌ 8 ప్రాంతాల్లో గెలిచింది. ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ కేవలం మందమర్రి, భూపాలపల్లి ఏరియ్లాలోనే విజయం సాధించింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం అయిన ఐఎన్‌టీయూసీ.. ఏఐటీయూసీకి మద్దతు తెలిపింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో మార్పు రావడంతో.. ఒక దశలో పోటీ నుంచి తప్పుకోవడానికి టీజీబీకేఎస్‌ వెనుకడుగు వేసింది. గత ఎన్నికల్లో పోటీ చేయని ఐఎన్‌టీయూసీ ఇప్పుడు అనూహ్యంగా బలపడింది. మెజారిటీ ఏరియాలను కైవసం చేసుకోవాలని, గుర్తింపు సంఘం హోదా కూడా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో నేడు జరగబోయే ఓట్ల లెక్కింపులో ఏ పార్టీ పై చేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.