Rohit Pawar Seeks Minister Rammohan Naidu Resignation: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద మరణం వెనుక పెను కుట్ర దాగి ఉందని ఆయన మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఈ విమాన ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగింది కాదని, అజిత్ పవార్‌ను హతమార్చేందుకు పథకం ప్రకారం జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు. విమానంలో బాంబుల్లా పనిచేసే అదనపు ఇంధన ట్యాంకులను అమర్చడం వల్లే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉందని రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

ఈ ఘటనపై పారదర్శకమైన విచారణ జరగాలంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన  వీఎస్ఆర్ వెంచర్స్  సంస్థకు, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పదవిలో ఉంటే విచారణ సంస్థలపై ఒత్తిడి ఉండే అవకాశం ఉందని, అందుకే ఆయన తప్పుకోవాలని స్పష్టం చేశారు.   

దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నాయని రోహిత్ పవార్ వేలెత్తి చూపారు. ప్రయాణానికి కొద్ది నిమిషాల ముందు పైలట్లను ఎందుకు మార్చారు? విమానంలోని వాయిస్ రికార్డర్  ఎందుకు పనిచేయలేదు? విమాన ఇంజన్లు కాలం చెల్లినవని తెలిసినా అధికారులు ఎలా అనుమతించారు? వంటి ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే స్వతంత్ర కమిటీతో విచారణ జరపాలని ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు.   

ఈ మొత్తం వ్యవహారంపై అంతర్జాతీయ నిపుణులతో విచారణ జరిపించాలని రోహిత్ పవార్ విజ్ఞప్తి చేశారు. స్థానిక దర్యాప్తు సంస్థల నివేదికలపై తమకు నమ్మకం లేదని, నిజనిజాలు బయటకు రావాలంటే నిష్పక్షపాత విచారణే మార్గమని ఆయన పేర్కొన్నారు. అజిత్ పవార్ వంటి సీనియర్ నాయకుడి మరణం వెనుక ఉన్న శక్తులను వెలికితీయకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.