Revanth Reddy Review: రైతు భరోసా నిధుల విడుదల గురించి ఎదురు చూస్తున్న రైతన్నలకు గుడ్ న్యూస్. త్వరలోనే రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. సోమవారం (డిసెంబర్ 11) సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. రైతు భరోసా నిధుల విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల మొదలు అవుతుందని సీఎం రేవంత్‌ సమీక్షలో చెప్పారు. మరోవైపు, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ విషయంలో కార్యారచణ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.


డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ పైనా రివ్యూ 


రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణరావు  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవీ గుప్తా, ఇంటలిజెన్స్ విభాగం అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కొటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలన్నారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను విక్రయించడం, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీఎస్‌నాబ్ ను తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణ మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.