Massive polling in Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి ఈ సారి గత రికార్డులు తిరగరాసేలా భారీ ఓటింగ్ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం, ముఖ్యంగా యువత , మహిళా ఓటర్లలో కనిపిస్తున్న ఉత్సాహం దీనికి ప్రధాన కారణం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఎన్నికల పోలింగ్ రికార్డులు
తమిళనాడు ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 72.81 శాతం పోలింగ్ నమోదైంది. అంతకుముందు 2016లో 74.26 శాతం , 2011లో అత్యధికంగా 78.12 శాతం ఓటింగ్ జరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో సగటున 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. అయితే, ఈసారి ఆ పాత రికార్డులన్నింటినీ దాటి పోలింగ్ శాతం 80 శాతానికి చేరువయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పోలింగ్ పెరగడానికి ప్రధాన కారణాలు
ఈసారి పోలింగ్ భారీగా పెరగడానికి రాజకీయ ముఖచిత్రంలో వచ్చిన మార్పులే ముఖ్య కారణం. ద్రవిడ దిగ్గజాలు లేని రెండో అసెంబ్లీ ఎన్నికలు కావడంతో పాటు, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం రాకతో త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంది. ఇది యువ ఓటర్లను భారీగా ఆకర్షించింది. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న యువత ఈసారి నిర్ణయాత్మక శక్తిగా మారడం పోలింగ్ శాతాన్ని పెంచేలా ఉంది.
ఓటర్ల జాబితా ప్రక్షాళన - కీలక మలుపు
ఈ భారీ పోలింగ్ అంచనాల్లో అత్యంత కీలకమైన అంశం ఓటర్ల జాబితా ప్రక్షాళన . ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక తనిఖీల ద్వారా దాదాపు 97 లక్షల అనవసర ఓట్లను జాబితా నుండి తొలగించారు. ఇందులో మరణించిన వారు, వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు , డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో డెడ్ వుడ్ తగ్గిపోవడం వల్ల, వాస్తవంగా ఓటు వేసే వారి సంఖ్య శాతం పరంగా పెరిగి కనిపిస్తుంది. ఇది ఎన్నికల ఫలితాలను మరింత స్పష్టంగా ఉంచడానికి దోహదపడుతుంది.
ప్రజా సమస్యలు , ప్రచార హోరు
రాష్ట్రంలో అధికార పక్షం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒకవైపు, నిరుద్యోగం మరియు ధరల పెరుగుదల వంటి సమస్యలపై ప్రతిపక్షాల పోరాటం మరోవైపు ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లు ఉదయం 7 గంటలకే భారీగా తరలివచ్చారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నీడ కోసం పందిళ్లు, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించడం వల్ల వృద్ధులు, మహిళలు అసౌకర్యం కలగకుండా ఓటు వేయగలుగుతున్నారు. దీనికి తోడు సెలబ్రిటీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఓటు హక్కు వినియోగంపై జరిగిన ప్రచారం కూడా సామాన్యుల్లో చైతన్యం నింపింది.
