Massive polling in Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 234 నియోజకవర్గాల్లో ఒకే విడతలో జరిగిన పోలింగ్ రికార్డు స్థాయి దిశగా దూసుకుపోయింది. సాయంత్రం  పోలింగ్ ముగిసే సమయానికి ఇది 85 శాతాన్ని మించిపోయి సరికొత్త రికార్డును సృష్టించింది.  పోలింగ్ సందర్భంా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.  రాజధాని చెన్నైలో కూడా గతంలో కంటే భిన్నంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా చెన్నైలోని ఆర్.కె నగర్ (87.12%), పెరంబూర్ (86.72%) నియోజకవర్గాల్లో భారీ ఓటింగ్ నమోదైంది.

Continues below advertisement

 ఓటర్ల జాబితా ప్రక్షాళన సత్ఫలితాలు 

ఈ భారీ పోలింగ్ శాతానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం చేపట్టిన  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ . దీని ద్వారా సుమారు 10 శాతం వరకు ఉన్న బోగస్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు ,  అడ్రస్ మారిన వారి పేర్లను తొలగించి జాబితాను క్లీన్ చేశారు. ఫలితంగా 2021లో ఉన్న 6.30 కోట్ల ఓటర్ల సంఖ్య ఈసారి 5.70 కోట్లకు తగ్గినప్పటికీ, వాస్తవ ఓటర్ల భాగస్వామ్యం పెరగడం వల్ల పర్సంటేజీ గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు.  

Continues below advertisement

విజయ్ పార్టీ (TVK) మేజిక్ 

ఈ ఎన్నికల్లో ముఖ్యాంశం దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం . తొలిసారి బరిలోకి దిగిన ఈ పార్టీ యువతలో, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న వారిలో విపరీతమైన క్రేజ్ నింపింది. విజయ్ ఓటు వేసేందుకు నీలాంకరైలోని పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు అభిమానులు పోటెత్తడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. విజయ్ రాకతో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య సాగే సంప్రదాయ పోరు కాస్తా త్రిముఖ పోటీగా మారి ఓటింగ్ శాతం పెరగడానికి దోహదపడింది.

 ప్రముఖుల ఓటింగ్  - చెదురుమదురు ఘటనలు

ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి , సీమాన్ వంటి రాజకీయ నేతలతో పాటు రజనీకాంత్, అజిత్, విజయ్, సూర్య వంటి సినిమా సెలబ్రిటీలు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధర్మపురి, మదురై వంటి కొన్ని చోట్ల కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు మినహా, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.    

 ఫలితం ఎవరికి అనుకూలం? 

సాధారణంగా భారీ పోలింగ్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత అని భావిస్తారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన వల్ల ఈ శాతం పెరిగిందా లేక కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. డీఎంకే తన సంక్షేమ పథకాలపై ధీమాగా ఉండగా, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి మార్పును ఆశిస్తోంది. తమిళ ప్రజల తీర్పు ఏంటనేది మే 4, 2026న వెలువడే ఫలితాల్లో తేలనుంది.