Rahul Gandhi Unwell: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉన్నా ఆయన హాజరు కావడం లేదని పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ విషయం వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నా, ఝార్ఖండ్‌లోని రాంచీలో I.N.D.I.A కూటమి భారీ ర్యాలీలు చేపడుతోంది. ఈ రెండు ర్యాలీలకూ రాహుల్ రాలేకపోతున్నారని కాంగ్రెస్ తెలిపింది. ఫుడ్ పాయిజన్ అయ్యుండొచ్చని భావిస్తున్నారు. 


"రాహుల్ గాంధీ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతానికి ఆయన ఢిల్లీ విడిచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆయనకు బదులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాంచీ ర్యాలీలో పాల్గొంటారు. ఆయనే మధ్యప్రదేశ్‌లోని సాత్నాకి కూడా వెళ్తారు"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత


 






ఈ ర్యాలీల్లో ప్రతిపక్ష కూటమిలోని కీలక నేతలతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ హాజరయ్యే అవకాశాలున్నాయి. వీళ్లతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి భార్య సునీతా కేజ్రీవాల్, ఝార్ఖంఢ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ హాజరు కానున్నారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్ట్‌లను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతోంది ప్రతిపక్ష కూటమి. దాదాపు 5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని అంచనా.